రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాష్ కు వ్యతిరెకంగా ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపలేదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఐదుషరతులతో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. 5 లక్షల రూపాయల పూచీకత్తుతో రెండు ష్యూరీలు సమర్పించాలని, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లవద్దని ఆదేశించింది. అలాగే జూన్ చివరి వరకు ప్రతీశనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలనీ కోర్టు అవినాష్ రెడ్డికి స్పష్టం చేసింది.
అలాగే సీబీఐ విచారణకు సహకరించాలంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఇప్పటికే ఏడుసార్లు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈనెల 22న మాత్రం ఆయన విచారణకు హాజరుకాలేదు. తన తల్లి అనారోగ్యానికి గురవడంతో గడువు కోరారు. ప్రస్తుతం ఆమె కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో విచారణకు హాజరైనప్పుడే తాను అన్ని విషయాలు సీబీఐ అధికారులకు తెలియజేశానని అవినాష్ చెప్పారు. వివేకా హత్య కేసుకు సంబంధించి తన దగ్గరున్న సమాచారం మొత్తాన్ని వారికి వివరించానని..ఏదీ దాచలేనని కోర్టుకూ తెలిపారు. ముందస్తు బెయిల్ పిటీషన్ కోసం దరఖాస్తు చేసుకుంటూ కూడా ..తన తల్లి కోలుకునేంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా,,ముఖ్యంగా అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
సుప్రీంలో బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా..జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. 25వ తేదీ నాటికి విచారణను ముగించాలనీ అంది. సుప్రీం ఆదేశాలతో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు..సీబీఐకి పలు ప్రశ్నలూ సంధించింది. ఇవాళ తుది విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది.