శుభసూచకం.. దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసుల సంఖ్య
దాదాపు ఏడాదిగా దేశంలో అలజడి సృష్టిస్తోన్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది మార్చి నుంచి రోజురోజుకు కేసుల సంఖ్య పదుల్లో మొదలై.. ఏకంగా లక్ష కేసుల మార్క్ను కూడా చేరుకున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా మంగళవారం నాడు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. గతేడాది జూన్ 7వ తేదీ తర్వాత.. అత్యల్పంగా పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
కాగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 8,635 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,66,245కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 13,423 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,04,48,406 మంది కోలుకున్నారు. ఇక కరోనా బారినపడి 94 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 1,54,486కు చేరుకుంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,63,353 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 39,50,156 మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.