కశ్మీర్ లోయలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. కశ్మీరీ హిందువులే లక్ష్యంగా ఉగ్రదాడులు మొదలయ్యాయి. తాజా హింసకు కారణం ప్రభుత్వం చేపట్టిన ఆంటీ ఎన్క్రోచ్ మెంట్ డ్రైవే కారణమా..అక్కడ ఉండలేక వలస వెళ్లిన, వెళ్తున్న వాళ్లను, వారి ఆస్తుల్ని పరిరక్షించాలని ప్రభుత్వం సంకల్పించడమేనా. పరిస్థితులు చూస్తుంటే అక్కడి తాజాహింసకు అదే ప్రధాన కారణం అని నమ్మకతప్పదు.
30 ఏళ్లనాడు…కల్లోల పరిస్థితుల నేపథ్యంలో కశ్మీర్ నుంచి వేలాదిమంది ఇళ్లూవాకిళ్లూ వదిలేసి భయంతో పారిపోయారు. పథకం ప్రకారమే వారిని వలసపక్షుల్ని చేసిన అవతలి వర్గం వారి ఆస్తుల్ని ఆక్రమించేసుకున్నారు. ఆర్టికల్ 370 తరువాత వలస వెళ్లిన హిందువులకు ధైర్యం వచ్చింది. ఆక్రమణదారులు కొందరు …అసలు యజమానులకు ఇల్లూ, పొలాల్నీ అప్పగించేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనే హిందువులపై ఉగ్రవాదుల దాడులు మొదలయ్యాయి.
30ఏళ్లనాడు భయంతో జన్మభూమిని వదిలివెళ్లిన, నిర్వాసితులైన కశ్మీరీ హిందువుల కోసం ఉచితభూమి ఇవ్వాలని తలపెట్టింది జమ్ముకశ్మీర్ ప్రభుత్వం. అందులో భాగంగా ఆక్రమణ వ్యతిరేక డ్రైవ్ పేరుతో ఓ ఉద్యమాన్నే మొదలుపెట్టింది.
1990 వ దశకంలో, ఇస్లామిక్ తీవ్రవాదులు…స్థానిక హిందువులపై దాడులు చేశారు. ఎందరో బాలికలు, మహిళల్ని అత్యాచారం చేశారు. హత్య చేశారు. ఇస్లాంలోకి మారాలని లేదంటే కశ్మీర్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. గత్యంతరం లేని స్థితిలో వేలాదిగా హిందూ కుటుంబాలకు ప్రాణాలు అరచేతబెట్టుకుని వలసవెళ్లాయి. తీవ్రవాదులనుంచి తమను తాను కాపాడుకునేందుకు ఇళ్లూవాకిలి వదిలేసి కట్టుబట్టలతో వెళ్లారు ప్రజలు.
ఇక 370 ఆర్టికల్ రద్దుతో అక్కడ మళ్లీ ప్రజాస్వామ్య వాతావరణం కనిపిస్తోంది. అందులో భాగంగా నిర్వాసితులైన కశ్మీరీల ఆస్తుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించింది. కశ్మీరీ హిందువులు తమ ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదులు అందులో సమర్పించే అవకాశం కల్పించింది.
నాడు వలస బాట పట్టి దేశం నలుమూలలా ఎక్కడెక్కడికో చేరి నివసిస్తున్న పండిట్లు ఆ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. ఆధారాలతో ఫిర్యాదులు అందిన వెంటనే ఆక్రమణ తొలగింపు మొదలవుతుందని ప్రభుత్వం, అధికారులు ప్రకటించారు.
బాధితులనుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయి. సున్నితమైన ప్రాంతం అనంత నాగ్ జిల్లా నుంచి అత్యధికంగా అక్రమ ఆక్రమణల గురించి కంప్లైట్లు వచ్చాయి.
ఇటీవలే పండిట్లకు చెందిన 5 కనాల్ల భూమిని అధికారులు రికవరీ చేసి భూయజమానికి అందచేశారు. పండిట్ల భూ ఆక్రమణలో భూమాఫియా కూడా జోక్యం చేసుకున్న సందర్భాలున్నాయి గతంలో. గులాం రసూల్ అనే వ్యక్తి కబ్జా చేసిన ఐదు కనాళ్ల భూమిని ఎంఎల్ ధర్ అనే వ్యక్తికి అప్పగించినట్టు అనంత్ నాగ్ రెవెన్యూ అధికారులు తెలిపారు. అలాగే పూలన్ రైనా అనే హిందూ మహిళకు చెందిన 3 కనాళ్ల భూమిని పొరుగునే ఉన్న మహ్మద్ ఇస్మాయిల్ ఆక్రమంచగా దాన్ని తిరిగి అసలు యజమానికి అప్పగించే సన్నాహాలు జరుగుతున్నాయి.
రోషన్ లాల్ కౌల్ అనే అతనికి చెందిన ఆరు కనాళ్ల భూమిని మహ్మద్ షబ్బీర్ నుంచి బోలేనాథ్ కు స్వాధీనం చేశారు.
కశ్మీరీ పండిటే అయిన భాస్కర్ పూర్వీకులకు 5 ఎకరాల భూమి ఉంది. వాళ్ల కుటుంబం వలసవెళ్లాక అక్కడివాళ్లు ఆక్రమించేశారు. అందులో యాపిల్, పియర్ తోటలు వేశారు. తమ భూమికి తమకు అప్పగించాలంటూ రెవెన్యూఅధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు.కానీ ప్రయోజనం లేదు. ఏళ్లనుంచి వాళ్లు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోర్టల్ ప్రారంభించడంతో న్యాయం జరుగుతుందనే ఆశతో ఉంది భాస్కర్ కుటుంబం.
అక్రమ ఆక్రమణలకు సంబంధించి అనంత్ నాగ్ జిల్లాలోనే తే 390 కేసుల పరిష్కారం కూడా అయిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. 20 కేసుల్లో ఆక్రమణదారులు వినకపోతే నోటీసులు పంపినట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇక షోపియాన్ జిల్లాలో కూడా 113 భూ ఆక్రమణల సమస్యను పరిష్కరించి అసలు యజమానులకు అప్పగించారు. కుంప్వారా, బారాముల్లా, గందర్బల్లో కూడా అసలుదారులకు భూమి అప్పగించే సన్నాహాలు జరుగుతున్నాయి.