ఆలయాలపై దాడులు.. ఏం చేస్తున్నారు బిజెపి నేతలు?
ఆంధ్రప్రదేశ్ లో వరసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న ఇక్కడి బిజెపి నాయకులు సరిగా స్పందించక పోవడంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ గా ఉందని సమాచారం. ముఖ్యంగా విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసంపై ఏపీ బిజెపి సరిగ్గా స్పందించలేదని ఆ పార్టీ నాయకత్వం భావించిందని తెలిసింది. హిందూ సంఘాలు వెంటనే స్పందించినా బిజెపి కార్యాచరణ ఆలస్యంగా మొదలైందనే అభిప్రాయం ఉంది. సాధారణంగా మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు కూడా వెంటనే స్పందించారు. రామతీర్థం వెళ్లారు. మైనారిటీలను మచ్చిక చేసుకునే వ్యూహాన్ని పక్కనబెట్టారో లేక హిందువులకు దగ్గర కావాలని అనుకున్నారో గానీ రామతీర్థం ఘటనపై బాబు తీవ్రంగానే స్పందించారు.
ఏపీలో మొత్తం మీద 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. అంతర్వేదిలో రథం దహనంపై ఏపీ బిజెపి వెంటనే స్పందించింది. తమి నిరసన గళాన్ని నేతలు గట్టిగా వినిపించారు. ప్రదర్శనలతో ప్రభుత్వంలో కదలిక తెచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అనేక ఘటనలపై మాత్రం అంతంత మాత్రంగానే స్పందిస్తున్నారని, ప్రకటనలకే పరిమితం అవుతున్నారని ఢిల్లీ పెద్దలు భావించినట్టు సమాచారం. అందుకే, హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించేలా ఒత్తిడి తేవాలని సూచించినట్టు తెలిసింది. ఆయోధ్యలో రామాలయానికి నిధి సమర్పణ అభియాన్ మొదలు కాబోతోంది. అయోధ్య రామజన్మభూమి ఉద్యమంతోనే బిజెపి ఎదిగింది. ఏపీలో మాత్రం బిజెపి నేతలు అనుకున్నంతగా జగన్ సర్కారుపై ఒత్తిడి తేవడం లేదు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని, అధికార పార్టీని నిలదీస్తూ ఉక్కిరి బిక్కిరి చేయాల్సింది పోయి మాటలకే పరిమితం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మరో పక్క, తెలంగాణలో రోజుకో అంశంపై బిజెపి శ్రేణులు కదంతొక్కుతున్నాయి. ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. తెలంగాణ బిజెపిని చూసి ఏపీ నేతలు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయం. జాతీయ నాయకత్వం కూడా అలాగే భావిస్తోందని సమాచారం.