భారతీయులంతా ముక్తకంఠంతో కోరుకొంటున్నది ఒక్కటే. పాకిస్థాన్ కు జీవితాంతం గుర్తు ఉండిపోయేలా బుద్ది చెప్పాలి. అందుకు తగినట్లుగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. పాకిస్థాన్ కు ముప్పేట దాడిని రుచి చూపించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
….
తాజాగా పాకిస్థాన్ కు భారత్ నుంచి ఔషధాలు, టీకాల సరఫరాను నిలిపివేయాలన్న డిమాండ్ ఊపందుకొంటోంది. ఎందుకంటే పాకిస్థాన్ లో అత్యధికంగా ఉపయోగించే మందులు, టీకాలు, ఇతర ఉత్పత్తులు భారత్ లో తయారయ్యేవే. ఈ సమయంలో.. భారత్ నుంచి ఎగుమతి చేసే ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులు వివరాలను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సేకరిస్తోంది. ఆ వివరాలను అత్యవసరంగా పంపాలని ప్రధానమైన ఫార్మా కంపెనీలను కోరుతున్నారు. ఈ డేటా ఆధారంగా చర్యలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
…
ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న 219 దేశాల్లో పాకిస్థాన్ అగ్ర స్థానంలో ఉంది. అయితే పాకిస్థాన్ కు నేరుగా ఎగుమతి జరిగే అవకాశం లేదు. అందుచేత దీనికి దుబాయ్ సెంటర్ పాయింట్ గా నిలుస్తోంది. మొదటగా భారత్ నుంచి యూఏఈకి ఎగుమతి అయ్యాక, అక్కడ నుంచి ఔషధాలు, టీకాలను తిరిగి పాకిస్థాన్ దిగుమతి చేసుకుంటుందని తెలుస్తోంది. ఈ లింక్ వివరాలన్నింటినీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది.
కాగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురికావడం ఇదే తొలిసారి కాదు. బాలాకోట్ వైమానిక దాడులు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా ఈ పరిస్థితులు కనిపించాయి. మరో వైపు పాకిస్థాన్కు ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతిని కూడా పరిమితం చేయాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిపై ఆంక్షలు విధించే దిశగా యోచన చేస్తున్నట్లు సమాచారం.
మొత్తం మీద పాకిస్థాన్ కు అత్యవసరంగా ఉండే వస్తువులు అన్నింటినీ నిలిపివేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. అప్పుడే పాకిస్థాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి.. కిందకు దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.