దేశ వ్యతిరేక, మత విద్వేష ప్రసంగాలు చేస్తున్న ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ పై ఓ యువకుడు దాడి చేశాడు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని నహర్ షా వలీ ఖజ్రానా దర్గాకు వెళ్లి బయటకు వస్తున్న పఠాన్ పై ఓ యువకుడు నల్లరంగు పూశాడు. వారిస్ పఠాన్ ఆలిండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) జాతీయ అధికార ప్రతినిధి. సలార్-ఎ-ఉమ్మత్ ఛారిటబుల్ హాస్పిటల్ను ప్రారంభించేందుకు ఆయన ఇండోర్ వచ్చారు. కార్యక్రమం అనంతరం దర్గానుంచి బయటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. దాడి చేసిన యువకుడిని సద్దాంగా గుర్తించారు. పఠాన్ మొహానికి రంగు పూసి పారిపోయిన సద్దాంను కాసేపటికే పోలీసులు పట్టుకున్నారు.
దాడి చేసిన సద్దాం ఖజ్రానాలోని పటేల్ కాలనీ వాసి అని పోలీసులు తెలిపారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు మతపరంగా మనుషుల్ని విభజించే ప్రసంగాలు చేస్తూ ముస్లింల పరువు తీస్తున్నందుకే అతనిపై దాడి చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతని వెనక రాజకీయ శక్తుల ప్రమేయం ఏమన్నా ఉందా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తనపై కాంగ్రెస్ పార్టీనే దాడి చేయిస్తోందని వారిస్ ఆరోపిస్తున్నారు.