ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తం నెలకొంది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై సభలో దాడి జరిగింది. జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ తమ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గర నిరసన తెలుపుతుండగా… డోలా బాల వీరాంజనేయ స్వామిపై వైసీపీ సభ్యుడు టీజేఆర్ సుధాకర్ బాబు దాడి చేశాడని టీడీపీ ఆరోపిస్తోంది. ఇలాగే పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిపైనా వెల్లంపల్లి శ్రీనివాస్ దాడి చేశారని చెబుతున్నారు. అయితే దాడి సమయంలో ఒక్కసారిగా అసెంబ్లీలో లైవ్ ఆపేశారు. దీంతో ఆ దృశ్యాలు రికార్డు కాలేదు. సుధాకర్ బాబును టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.వాయిదా తరువాత బయటకు వచ్చిన టీడీపీ నేతలు అధికార పార్టీపై మండిపడ్డారు. జీవో నెంబర్ 1పై నిరసన తెలియజేస్తున్న తమ ఎమ్మెల్యేలపట్ల వైసీపీ సభ్యులు గుండాల్లా వ్యవహరించారని…ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఘనవిజయం నుంచి దృష్టి మల్లించేందుకు వైసీపీ నేతలు ఈ దాడికి తెగబడ్డారని అచ్చన్నాయుడు ఆరోపించారు. అటు తమ ఎమ్మెల్యేలపై వైసీపీ సభ్యుల దాడిని చంద్రబాబు ఖండించారు. జగన్ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని…ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని…ఏపీ అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజని ఆయన అన్నారు.