
Anish Khan, a ISF student leader
పశ్చిమబెంగాల్లో మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ విద్యార్థి నాయకుడు అనిష్ ఖాన్ దారుణ హత్యకు గురయ్యాడు. హౌరా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని హత్య చేశారు. హౌరాలో మమతా సర్కారుకు వ్యతిరేకంగా దాదాపు 130 రోజులుగా అనీష్ ఖాన్ ఆందోళన చేస్తున్నాడు. ఆయన నేతృత్వంలో జరుగుతున్న ఆందోళనల్లో పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో హౌరా జిల్లాలోని ఆమ్తాలోని ఆయనింటి దగ్గరే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం కలకలం రేపుతోంది. అనీశ్ ను హత్య చేసిన నలుగురిలో ఒకతను పోలీసు యూనిఫాంలో ఉన్నారని…మిగతావారు ఒకే రకమైన యూనిఫాం ధరించాలని అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. రెండో అంతస్తు నుంచి తోసేశారని వారుఆరోపిస్తున్నారు.
మధ్యాహ్నం పన్నెండుగంటలకు నలుగురు తమింటికి వచ్చారని ఓ వ్యక్తి యూనిఫాంలో ఉండడంతో పోలీసులను భావించామని… యూనిఫాంలో ఉన్న వ్యక్తి తమతోనే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాడని…ముగిలిన ముగ్గురూ తన కొడుకును పైకి తీసుకెళ్లారని..కాసేపటికే పెద్ద శబ్దం వినిపించిందని…వెళ్లి చూస్తే కింద తన కొడుకు రక్తపు మడుగులో ఉన్నాడని… నలుగురు వ్యక్తులూ పారిపోయారని అనీష్ తండ్రి సలేంఖాన్ వాపోయారు.
అయితే అనీష్ కుటుంబసభ్యుల ఆరోపణల్ని పోలీసులు ఖండించారు. పోలీసులు ఎలాంటి విచారణకు వెళ్లలేదని ఎవరో చెబితే విచారణ చేస్తామనీ అంటున్నారు.
అనీష్ ఖాన్ హత్యతో హౌరా జిల్లా భగ్గుమంది. హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కోల్కతాలోని సెవెన్ పాయింట్ పార్క్ సర్కస్ క్రాసింగ్ను అడ్డుకునేందుకు అలియా యూనివర్సిటీ విద్యార్థులు పెద్దఎత్తున రోడ్లమీదకు వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనకారులకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అనీష్ ను హత్య చేసిన వాళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బారికేడ్లను తొలగించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి హింసాత్మకంగా మారింది.
అయితే అనీష్ ఖాన్ హత్య వెనక కుట్ర ఉండవచ్చని మంత్రి ఫిర్హాద్ హకీం ఆరోపించారు. ఇలాంటి ఘటనలు ఉత్తరప్రదేశ్ లో మాత్రమే జరుగుతాయని…రాష్ట్రం వెలుపలి నుంచి వచ్చిన వాళ్లే అతన్ని హత్య చేసి ఉండవచ్చని అన్నారు. విచారణ కొనసాగుతోందని…త్వరలోనే పోలీసులు…హంతకులను పట్టుకుంటారని అన్నారు.