అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మ…. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై పరువునష్టం దావావేశారు.
గౌహతిలో కమ్రూప్ (మెట్రో)లోని సివిల్ జడ్జి కోర్టులో రూ.100 కోట్ల పరువు నష్టానికి కేసువేశారు.
దేశంలో 2020లో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు మార్కెట్ ధరలకు మించి పీపీఈ కిట్లను సరఫరా చేసేందుకు అస్సాం ప్రభుత్వం ముఖ్యమంత్రి భార్యకు సంబంధించిన సంస్థలు, అలాగే కుమారుడి వ్యాపార భాగస్వామికి కాంట్రాక్టులు ఇచ్చిందని ఆప్ నేత సిసోడియా జూన్ 4న ఆరోపించారు.
సిసోడియాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అప్పుడే హిమంత బిస్వా శర్మ చెప్పారు.
“ దేశం యావత్తూ అత్యంత ఘోరమైన మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో, అస్సాంలో పీపీఈ కిట్లు లేవు. నా భార్య ధైర్యం చేసి ముందుకు వచ్చి 1,500 PPE కిట్లను ఉచితంగా ప్రభుత్వానికి అందించి ప్రాణాలు కాపాడింది. ఆమె ఒక్క పైసా కూడా తీసుకోలేదు” అని హిమంత అన్నారు.
ఎన్హెచ్ఎం-అస్సాం మిషన్ డైరెక్టర్ ఎస్ లక్ష్మణన్ జేసీబీ ఇండస్ట్రీస్కు సంబంధించిన బిల్లును ట్యాగ్ చేస్తూ సిసోడియా ట్వీట్ చేశారు.
“గౌరవనీయ ముఖ్యమంత్రి హిమంత బిస్వా జీ! JCB ఇండస్ట్రీస్ పేరుతో 5000 కిట్లను ఒక్కో కిట్కు 990/- చొప్పున కొనుగోలు చేసేందుకు మీ భార్య ఒప్పందం ఇదిగో… చెప్పండి, ఈ పేపర్ అబద్ధమా? ఆరోగ్య మంత్రిగా ఉన్న మీ భార్య కంపెనీకి టెండర్ కొనుగోలు ఆర్డర్ ఇవ్వడం అవినీతి కాదా?” అని సిసోడియా ట్వీట్ చేశారు.
సిసోడియా ఆరోపణలపై హిమంత భార్య రినికి భుయాన్ శర్మ వివరణ ఇచ్చారు.
“మహమ్మారి మొదటి వారంలో అస్సాంలో ఒక్క PPE కిట్ కూడా అందుబాటులో లేదు. అదే విషయాన్ని తెలుసుకుని, నేను ఒక వ్యాపార పరిచయస్థుడిని సంప్రదించాను, చాలా ప్రయత్నం తర్వాత దాదాపు 1500 PPE కిట్లను NHMకి అందించాను. తర్వాత నా CSRలో భాగంగా దీనిని పరిగణించమని NHMకి లేఖ రాశాను. నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు. నా భర్త రాజకీయాలతో సంబంధం లేకుండా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్నాను. నేను ఎల్లప్పుడూ పారదర్శకంగా ఉంటాను”అని రినికి శర్మ అన్నారు .
రినికి భుయాన్ శర్మ తరఫు న్యాయవాది పద్మాధర్ నాయక్ మాట్లాడుతూ, ఈ కేసు బుధవారం లిస్ట్ అవుతుందని, తాము మరింత ముందుకు వెళ్తామని ఆశిస్తున్నామని చెప్పారు.