రాజధాని గువాహతి వీధుల్లో హల్ చేశారు అసోం సీఎం హిమంత బిశ్వాస శర్మ. న్యూఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ను పర్యవేక్షిస్తూ స్వయంగా పెట్రోలింగ్ నిర్వహించారు. డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ కేసు ఒక్కటి కూడా లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న హిమంత రాత్రి ట్రాఫిక్ పోలీసులతో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. రాత్రిపూట మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దన్న ప్రచారం విజయవంతమవుతోందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
“రాత్రంతా గౌహతి వీధుల్లో ఉన్నాను. డిసెంబరు 31వ తేదీని ప్రమాద రహిత రాత్రిగా మార్చాలన్న మా విజ్ఞప్తికి మంచి స్పందన వచ్చింది. అందుకు కృషిచేస్తున్న పోలీసులకు అభినందనలు. ప్రతిరోజూ ఈ ప్రయత్నం కొనసాగించాలి. 2022లో ఒక్క ప్రమాదం కూడా నమోదు కావద్దు’ అని శర్మ ట్వీట్ చేశారు.
పెట్రోలింగ్ లో స్వయంగా పాల్గొన్న సీఎంను వాహనదారులు ఆప్యాయంగా పలకరించారు. తాము పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించగలిగామని… డిసెంబర్ 31 రాత్రి ఒక్క డ్రంకెన్ డ్రైవ్ కేసు కూడా నమోదు కాలేదని ఆయన అన్నారు. గతేడాది న్యూఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో 29 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఈ డ్రైవ్ చేపట్టారు సీఎం.