లఖింపూర్ ఖేరీ కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీం కోర్టు గట్టి షాకిచ్చింది. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు పక్కన పెట్టింది. మిశ్రాకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసింది.అంతేకాదు వారంలోగా ఆశిష్ లొంగిపోవాలని ఆదేశించింది.
గతేడాది అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు ముందు జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన కారులో ఆశిష్ మిశ్రా ఉన్నారని రైతు సంఘాలు ఆరోపించగా, కేంద్ర మంత్రి కుమారుడు ఆ వాదనలను ఖండించారు.
అక్టోబరు 9వ తేదీన ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయగా.. అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బాధిత కుటుంబాల సభ్యులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. కేసు విచారణ ప్రారంభం కాకముందే .. పోస్టుమార్టం నివేదిక, గాయాల గురించి బెయిల్ ఉత్తర్వుల్లో హైకోర్టు ప్రస్తావించడాన్ని తప్పు పట్టింది. అసంబద్ధ విశ్లేషణలతో హైకోర్టు బెయిల్ ఇచ్చిందని అసహనం వ్యక్తం చేసింది. ఆశిష్ బెయిల్ దరఖాస్తుపై కొత్తగా మళ్ళీ విచారణ జరపాలని అలహాబాద్ హై కోర్టును సుప్రీం కోర్టు సూచించింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)