కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. ఇది కొన్ని కులాలు, వర్గాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావటంతో పోలీసులు పూర్తిస్థాయిలో సంయమనం పాటించగా… దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వర్గాలు విచ్చలవిడిగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల్ని ధ్వంసం చేశాయి.
ఈ అల్లర్ల వెనుక అమలాపురానికి చెందిన అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అమలాపురం స్టేషన్కు తరలించారు.
డీఐజీ పాలరాజు మాట్లాడుతూ, అమలాపురంలో ఆందోళనల్లో పాల్గొని విధ్వంసం సృష్టించిన వారిని గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకూడదని అమలాపురంలో కర్ఫ్యూ విధించడం లేదన్నారు.
ఈ నెల 18న ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఒక వర్గం సంబరాలు చేసుకోగా, మరో సామాజికవర్గం ఆందోళనలకు దిగింది. కోనసీమ జిల్లాగా మాత్రమే పేరు కొనసాగించాలంటూ ఉద్యమానికి సిద్ధమైంది.
ఆందోళనల్లో భాగంగానే జిల్లాలోని బ్యాంకు కాలనీలో ఉన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి విశ్వరూప్ ఇంటిని వందల మంది నిరసనకారులు చుట్టుముట్టారు. మంత్రి ఇంటికి నిప్పంటించారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆందోళనకారులు హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. కింది భాగంలో ఉన్న ఆఫీసుతోపాటు ఇంటికి నిప్పంటించారు.
ఈ విధ్వంసం వెనుక పక్కా ప్లాన్ తోనే మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యేల ఇళ్లకు పక్కా ప్రణాళికతోనే నిప్పు పెట్టారని సమాచారం. కీలక నేత అనుచరులే నిప్పు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.