నిరుపేదలకు ఆరోగ్య సేవలు అందించే ఆరోగ్యశ్రీ పథకం ఇబ్బందుల్లో పడింది గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద బకాయిలు చెల్లించడం లేదు దీంతో సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది.
వాస్తవానికి ఆరోగ్య శ్రీ అన్నది ఆరోగ్య బీమా రూపంలో అవుతుంది. దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేదలు లేదా అత్యవసర ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్న పేదవారు ఆరోగ్యశ్రీని ఉపయోగించుకోవచ్చు తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న నిరుపేదలంతా ఆరోగ్యశ్రీ కింద అర్హులే ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరియు హైదరాబాద్లోని కొన్ని ప్రధాన ఆసుపత్రులలో పేదలు ఉచితంగా వైద్య సహాయం పొందవచ్చు ఆ తర్వాత కాలంలో చికిత్సకు అయిన ఖర్చు ప్రభుత్వం పరిశీలన చేసి సదరు ఆసుపత్రికి చెల్లిస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం ఈ బకాయిల్ని పెండింగ్ పెడుతోంది. దీంతో సమస్య అంతకంతకు ముదిరిపోయింది.
బకాయిలు విడుదల చేయాలని చాలా కాలంగా ఆసుపత్రులు అడుగుతున్నాయి చివరికి విసిగిపోయి, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని వెల్లడించింది.
గత ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.1,500 కోట్ల వరకు ఉందని చెప్పింది. రూ.530 కోట్ల విలువైన బిల్లులను సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినట్లు ఈ నెల 2వ తేదీన సీఈఓ చెప్పారని కానీ ఇప్పటివరకు చెల్లించలేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వెల్లడించింది. ఉద్యోగుల ఆరోగ్య శ్రీ పథకం కింద సుమారు రూ.50 కోట్ల బిల్లుల చెల్లింపులే జరిగాయని తెలిపింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం నుంచి ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించామని పేర్కొంది.
ఆరోగ్యశ్రీ పథకం నిలిచిపోయినట్లయితే నిరుపేదలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు ఏపీలో ఆప ధర్మ ప్రభుత్వం నడుస్తోంది. బిల్లుల చెల్లింపు వంటి కీలక నిర్ణయం అధికారులు తీసుకోలేకపోవచ్చు. హైకోర్టు లేదా ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యేట్లు కనిపించడం లేదు.