ఉత్తరాఖండ్ లోని హిమాలయ ఎత్తుల్లో మంచుతో నిండిన ప్రాంతంలో భారత సైన్యం పహారా కాస్తున్న వీడియో బయటకు వచ్చింది. సబ్ జీరో ఉష్ణోగ్రతల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కు సంబంధించిన దృశ్యాలవి. తాళ్లు పట్టుకుని వాటి సాయంతో వెళ్తూ మంచులోకి కూరుకుపోతున్న కాళ్లను బలంగా పైకి లాక్కుని అడుగులో అడుగు వెస్తూ సాగుతున్నారు వాళ్లు.
మైనస్ 25 డిగ్రీ సెల్సియన్ ఉష్ణోగ్రతలో ఆ మంచు వీరులు ఆయుధాలు పట్టుకుని మోకాలి లోతు మంచులో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. కొన్నిరోజులుగా ఉత్తరాఖండ్ ఎత్తైన ప్రాంతాల్లో విపరీతమైన హిమపాతం. తెల్లటి మంచు అడుగుల మేర పేరుకుపోయి ఉంది. ఆ ప్రాంతాల్లో పహారా సైన్యానికి పెను సవాలే. అలాంటి పరిస్థితుల్లో సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.