
 
        ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు చేజిక్కించుకోవడం మధ్య ఆసియా దేశాలకు సంకట పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఒక ప్రక్క  ఎక్కువగా కనబడుతూ ఉంటే మరో ప్రక్క చైనా ఆఫ్ఘనిస్తాన్ లోని   తాలిబాన్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని దానిని అడ్డం పెట్టుకుని మధ్య ఆసియా దేశాల పై పట్టు సాధించడానికి దారులు వెతుకుతున్నది,  పాకిస్తాన్ ఇప్పటి కే  చైనా చేతిలో ఉంది,  మధ్య ఆసియా లోని శక్తివంతమైన దేశాల్లో రష్యా,  ఇరాన్ ల తో సంబంధాలు ఉండటం మాత్రమే కాకుండా కలిసి పని చేస్తున్నది చైనా తాలిభాన్లతో ఉదారంగా వ్యవహరించటం మనము  చూస్తున్నాము ,ఇంకొక ప్రక్క మధ్య ఆసియా లోని మూడు దేశాలతో ఆఫ్ఘనిస్థాన్ కు  ప్రత్యక్ష సరిహద్దులున్నాయి,  అందులో 1) తజికిస్థాన్,  ఆ దేశానికి ఆఫ్ఘనిస్తాన్ తో 1357 కిలోమీటర్ల సరిహద్దు ఉంది 2) ఉజ్బెకిస్తాన్,  దీనికి ఆఫ్ఘనిస్తాన్ తో 144 కిలోమీటర్ల సరిహద్దు ఉంది 3)తుర్క్మెనిస్తాన్,  దీనికి ఆఫ్ఘనిస్తాన్ తో 804 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది,  ఆ మూడు దేశాలు ఒక రకంగా చెప్పాలంటే ఆత్మరక్షణలో పడ్డాయి,  దానితో ఆ మూడు దేశాలు సరిహద్దులను మూసి వేయడం జరిగింది, పరిస్థితులు ఎట్లా ఉంటాయో చెప్పలేని స్థితిలో రష్యా నుండి ఆధునిక ఆయుధాల సేకరణ కూడా చేస్తున్నాయి,  దీనితో రష్యా  ప్రత్యక్షంగా పరోక్షంగా తన అవకాశాల కోసం వేచి చూస్తున్నది, మధ్య ఆసియా లో 11 దేశాలున్నాయి వాటిలో ఆఫ్ఘనిస్తాన్ తో దగ్గరి సంబంధం ఉండే దేశాలు ఐదు ఉన్నాయి అవి 1)kazakista 2)tajikistan 3)uzbekistan 4)kyrgyzstan 5)Turkmenistan ,ఈ దేశాల జనాభా7,29,60,000   ఉంటుంది,  ఈ దేశాలకు పశ్చిమాన కాస్పియన్ సముద్రము,  తూర్పున చైనా,మంగోలియా,  దక్షిణ ఆఫ్ఘనిస్తాన్,ఇరాన్,  ఉత్తరాన రష్యా  ఉంటాయి,  ఇందులో మూడు దేశాలపై ఆఫ్ఘనిస్థాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నది.  ఆదేశాలు రెండు ప్రమాదాలను గుర్తిస్తున్నాయి 1) ఆఫ్ఘనిస్తాన్ నుండి వలసలవరద 2 తాలిబా న్ల సిద్ధాంతాలు,  వాళ్ళ విలువల ప్రభావం అక్కడి సమాజంపై పడి వాళ్లు కూడా ఇస్లాం మూల సిద్ధాంతాల వైపు వెళ్తారేమోనని  భయపడుతున్నారు,  వాటి ప్రభావం పడితే పరిస్థితులు ఎట్లా ఉంటాయని  అంచనా కూడా వేస్తున్నారు,  అదే గనుక జరిగితే సెక్యులర్ భావాలతో ఉండే ప్రభుత్వాలకు మత తీవ్రవాదానికి సంఘర్షణ అనివార్యం అవుతుందని భయపడుతున్నారు.  ఆ మూడు దేశాలకు ఆఫ్ఘనిస్తాన్ తో ఇప్పటికే వాణిజ్యపరమైన,  మౌలిక వసతులుపరమైన  అనేక సంబంధాలు  ఉన్నాయి.
 
తాలిబాన్లు  చైనా విషయం లో సానుకూలంగా ఉన్నారు, చైనాకు అసంతృప్తి కలిగించే చర్యలు ఏవి తీసుకోకపోవడం,  ఎందుకంటే తమ ప్రభుత్వానికి చట్టబద్ధత , అంతర్జాతీయ గుర్తింపు రావాలి దానికి చైనా సహకారం ఎంతో అవసరం, తాలిబాన్లు ఇప్పటికే చట్టబద్ధత కోసం ప్రయత్నాలు ప్రారంభించి దాని కోసం ఒక అంతర్జాతీయ సమావేశం కూడా  నిర్వహించారు. ఇక్కడ  ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికా,  ఇంగ్లాండ్ మొదలైన దేశాలు తమ దౌత్య కార్యాలయాలు  ఎత్తివేసి తమ సిబ్బందిని వెనక్కి తీసుకున్న దగ్గర నుండి మధ్య ఆసియా దేశాల మధ్య మరింత సమన్వయం సాధించడానికి రష్యా తన ప్రయత్నాలు  వేగవంతం చేసింది,  రష్యా ఒక  ప్రక్క తాలిబన్లతో సంప్రదింపులు చేస్తూనే, మరోప్రక్క  ఆ ప్రభుత్వాన్ని గుర్తించడానికి తొందర పడటం లేదు,  వారి ప్రభుత్వ పాలన ఎంత బాధ్యతాయుతంగా ఉంటుందో అనే దానిపైనే మేము ఆ ప్రభుత్వాన్ని గుర్తించటం ఆలోచిస్తామని  అని చెప్తున్నారు ,  అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ తో  ప్రత్యక్ష సరిహద్దులు ఉన్న ఆ మూడు దేశాలు ఒక సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి,  ఒక ప్రక్క ఆఫ్గన్ రాజధాని కాబూల్ లో  తాలిబాన్ లా ఉనికిని  గుర్తిస్తూనే తాలిబాన్లు నిషేధిత సంస్థ గానే చూస్తున్నారు.  ఉజ్బెకిస్తాన్ కు చెందిన ఒక విశ్లేషకుడు ఒక  టీవీ ఛానల్ లో మాట్లాడుతూ” తాలిబాన్ల లోని అనేక తీవ్రవాద వర్గాలను చట్టబద్దంగా గుర్తించాలంటే అదొక సుదీర్ఘమైన ప్రక్రియ,  ఉజ్బెకిస్తాన్ అధికారులు తాలిబాన్ల సిద్ధాంతాలు,  విలువలకు  ఆమోదం తెలుపు కుండా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు అలా చేస్తే  తాలిబాన్ల  విజయం సమాజాలను తాలిబానికరణ చేసే ప్రమాదం ఉందని” హెచ్చరించారు.అట్లాగే మాజీ తుర్కిమెన్  దౌత్యవేత్త మాట్లాడుతూ” తాలిబాన్ల నుండి మధ్య ఆసియా కు  ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని,  తాలిబాన్లు కూడా మధ్య ఆసియా  పై పెద్ద ఆసక్తి లేదని ఆయన అంచనా వేస్తున్నాడు”.  మొత్తం మీద ఆఫ్ఘనిస్థాన్లోని పరిణామాలు ఆసియా ఖండంలోని అన్ని దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి,  దాని ప్రభావం ప్రజాస్వామ్య దేశాలపై  ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, అందుకే భారత్ మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది.
 
 ఆగస్టు 23 వ తేదీ నాడు భారత రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాన్ని గమనిద్దాం.  భారత్ లో  తలదాచుకుంటున్న వందలాది మంది ఆఫ్ఘన్ పౌరులు తమ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడాన్ని  వ్యతిరేకిస్తూ, మరియు  భారత ప్రభుత్వం తమను శరణార్ధులుగా గుర్తించాలని కోరుతూ  అమెరికా శరణార్థి ఏజెన్సీ (UNHCR ) ఆఫీస్ ముందు ర్యాలీ నిర్వహించారు.
                   ఆఫ్ఘనిస్థాన్లో మహిళలకు పిల్లలకు రక్షణ లేదని వాళ్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.  మేము 10 సంవత్సరాల నుండి ఇక్కడే  ఉంటున్నాము  మమ్ములను భారతదేశం ఇంకా శరణార్థులుగా గుర్తించడం లేదని చెప్పారు.  2019 నాటికే 40,000  మంది శరణార్ధులుగా గుర్తింపు ఇవ్వాలని తమ పేర్లు నమోదు చేసుకున్నారు, చేసుకోని వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు, అనిచెప్పారు .  ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులకు భయపడి ఈ మధ్య అనేకమంది ఇతర దేశాలకు వలసలు వెళ్లారు ఇంకా వెళ్ళుతున్నారు అట్లా  వలసలు వెళ్ళిన వారిలో 80 శాతం మంది మహిళలు,  పిల్లలు ఉన్నారు అని  అమెరికాసంస్థ  తెలియజేసింది,  వారు ఐదు లక్షల మంది పైగా  ఉంటారని అంచనా.
 
మహిళలు,  పిల్లలు తాలిబాన్లకు ఎందుకు భయపడుతున్నారు? మధ్య ఆసియాలోని  ముస్లిం దేశాలు కూడా తాలిబన్ల విషయంలో భయము,  అప్రమత్తంగా ఉంటున్నాయి  ఏమి కారణం? తాలిబాన్లు గతంలో పాలించిన రోజులు ప్రభావం వాళ్లకు గుర్తుకు వస్తూఉండవచ్చుఆ  మధ్యయుగాల నాటి పరిపాలన కారణంగా శిక్షలు కఠినంగా ఉండటం,  భయంకరంగా ఉండటం  ఇది ప్రమాదకరమని వాళ్ళ భావన కావచ్చు.  ప్రపంచం అందులో ముఖ్యంగా  ఆసియా ఖండం   ఇప్పటికైనా కళ్ళు తెరిచి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి జాగ్రత్త పడుతుందో,  లేక  సమస్యలు కొని తెచ్చుకుంటుంది వేచి చూద్దాం.
ఇప్పటికే రష్యా అమెరికా దేశాలు ఆఫ్ఘనిస్థాన్ లో తలదూర్చి తలబొప్పి కట్టించుకొని  వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి,  ఆ క్రమంలో చైనా  ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నది.  ఆధిపత్య పోరులో ఇవన్నీ జరుగుతున్నాయి.   అందరినీ కలుపుకొని పోయే నిర్ణయాలు చేయటం ప్రభావితం చేయగలగడం చేసే నాయకత్వం కోసం ప్రపంచం  ఈరోజు  ఎదురు చూస్తున్నది, చైనా ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నది, ఒకవేళ   చైనా అట్లా ముందుకు వస్తే సమస్యలకు అదే కేంద్ర మయిపోతుంది  అనేది చైనా చరిత్ర చెబుతున్నది,  ఆ పనిని సమర్ధవంతంగా నిర్వహించగలిగే భారత్ అంత ప్రభావం చూపలేకపోతున్నది.ఆ దిశలో భారత్ అడుగులు ఎప్పుడు పడతాయా  అని ప్రపంచం ఎదురు చూస్తున్నది.
రాంపల్లి మల్లికార్జునరావు