దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ జీవిత భీమా ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కోసం చకచకా ఏర్పాటు జరుగుతున్నాయి. స్టేక్ డైల్యూషన్ విధానంలో 3.5 శాతం వాటాను పబ్లిక్ ఆఫర్ ద్వారా అమ్మడానికి ఎల్ఐసీ బోర్డు ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయానికి రెగ్యులేటరీ అనుమతులు రావాల్సి ఉంది.ప్రస్తుతం మార్కెట్లో ఆటుపోట్లు నెలకొన్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్ ఆసక్తిని బట్టి వాటా పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వాటాల విక్రయం ద్వారా ఆరు లక్షల కోట్ల విలువతో రూ. 21 వేల కోట్ల నుంచి- రూ. 30 వేల కోట్ల వరకు ఐపీఓ ద్వారా సంపాదించాలని ప్రభుత్వం అంచనావేస్తోంది.
మే మొదటి వారంలో ఐపీఓ మార్కెట్లోకి రానుంది. పాలసీహోల్డర్లకు రిజర్వేషన్లు, డిస్కౌంట్లు, ఇష్యూ ధర బుధవారం నాటికి ఖరారవుతాయి. భారతీయ స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ ఐపీఓ అతిపెద్దదిగా నిలవనుంది. తుది గడువు మే 12 కంటే ముందే ఆఫర్ మొదలవుతుందని, ఆ తర్వాత మార్చి క్వార్టర్ ఫలితాలతో డీఆర్హెచ్పీని రీఫైల్ చేస్తారని అంటున్నారు.
స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు పెరగడంతో ఎల్ఐసీ వాటా అమ్మకాన్ని ఈ ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయవలసి వచ్చింది. మే 12 తరువాత కూడా ఐపీఓ మొదలుకాకుంటే, మరో రెండు నుండి మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఎల్ఐసీ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో 2.17 కోట్ల బీమా పాలసీలను అమ్మింది. ఇది పోయిన ఆర్థిక సంవత్సరం కంటే 3.54 శాతం ఎక్కువ. అమ్మిన పాలసీల పరంగా దాని మార్కెట్ వాటాను 74.6 శాతానికి పెంచుకుంది. ఎల్ఐసీ మెగా ఐపీఓపై కనీసం 12 భారీ ఫారిన్, డొమెస్టిక్ ఫండ్ మేనేజ్మెంట్ సంస్థలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
భారతదేశంలోని కనీసం ఐదు టాప్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, కనీసం మూడు పెద్ద విదేశీ సావరిన్ ఫండ్లు, రెండు గ్లోబల్ పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీలు, రెండు గ్లోబల్ హెడ్జ్ ఫండ్లు…ఈ ఎల్ఐసి ఐపిఓను నిర్వహించే బ్యాంకర్లకు రూ.18 వేల కోట్లు పెట్టుబడిగా అందించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ యాంకర్ ఇన్వెస్టర్లుగా రూ. 8 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని సమాచారం.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)