కడప జిల్లా పెనగలూరు మండలం కొండూరు గిరిజన కాలనీకి చెందిన జస్వా(10) కిడ్నీవ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడిని తండ్రి నరసింహులు ఆదివారం రాజంపేటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆదివారం నేరుగా స్విమ్స్కు వెళ్లాక… ‘ఇక్కడ చికిత్స చేయడం కుదరదు. రుయాకు వెళ్లండి’ అని పంపించేశారు. చివరికి రుయా ఆస్పత్రిలో జస్వాను చిన్న పిల్లల వార్డులో అడ్మిట్ చేసుకున్నారు. కిడ్నీలు దెబ్బతిన్నాయని, డయాలిసిస్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రాణాపాయం లేదని భరోసా ఇచ్చారు. కానీ చికిత్స ఫలించక సోమవారం సాయంత్రం జస్వా చనిపోయాడు.
https://twitter.com/xpressandhra/status/1518837283981512709?s=20&t=bJxPYK7BcMUx2icxW3XRCQ
మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు రుయా ఆస్పత్రికి చెందిన అంబులెన్స్లు ఉన్నాయి. కానీ చీకటి పడితే అవి బయటికి రావు.
ప్రైవేట్ అంబులెన్సులను సంప్రదించాడు తండ్రి, వారు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మామిడితోటలో తోటమాలీగా పనిచేసే నరసింహులు చేతిలో 2వేలు కూడా లేవు. అలాంటిది 20వేలు తెచ్చేదెలా? అని యజమానికి ఫోన్ చేసి సమస్య వివరించాడు. యజమాని తనకు తెలిసిన అంబులెన్సును 5 వేలకు మాట్లాడి హాస్పిటల్ కి పంపించాడు. కానీ ‘బయటి నుంచి వచ్చిన అంబులెన్స్లలో మృతదేహాలను తరలించేందుకు వీల్లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపో’’ అంటూ అంబులెన్సు డ్రైవర్పై దాడిచేసే ప్రయత్నం చేశారు ఆస్పత్రి ఆవరణలో ఉన్న కొందరు అంబులెన్సు నిర్వాహకులు.
దీంతో కుమారుడి మృతదేహాన్ని భుజంపైకి ఎత్తుకొని సాయంగా వెంట ఉన్న మరొక వ్యక్తి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. రుయా ఆస్పత్రి నుంచి కరకంబాడి వరకు సుమారు 10కిలోమీటర్ల దూరం ద్విచక్ర వాహనంపై వెళ్లి.. అక్కడ యజమాని పంపిన అంబులెన్సులోకి మృతదేహాన్ని ఎక్కించి స్వగ్రామానికి పయనమయ్యారు.
మంగళవారం ఉదయం ఈ వ్యవహారం బయటికి రావడంతో ఘటనపై ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హాస్పిటల్ ఆవరణలో మంగళవారం ఆందోళన చేపట్టారు. అంబులెన్స్ల వ్యవహారం మాఫియాలా తయారైందని.. వీటికి అడ్డుకట్టవేయాలని నినదించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డి వెంటనే స్పందించారు. ఆర్దీవో కానక రెడ్డి, డీఎంహెచ్వో శ్రీహరి, డీఎస్పీ మురళీకృష్ణతో కమిటీ వేసి వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రుయా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని కలెక్టర్కు నివేదిక అందజేశారు.ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎస్ ఆర్ఎంవో సరస్వతీ దేవిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. బయట నుంచి వచ్చిన అంబులెన్సును అడ్డుకున్న ఆరుగురు అంబులెన్సు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంబులెన్స్ దందాకు తావులేకుండా రేట్లు, రోస్టర్ విధానాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.