ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) కన్నుమూశారు. తెల్లవారుజామున 7:30 కి గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్ అపోలోకు తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. తెల్లవారుజామున ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.
వారం రోజులు దుబాయ్ పర్యటనలో ఉన్న గౌతమ్ ఆదివారమే హైదరాబాద్ వచ్చారు. అంతలోనే ఈ విషాద వార్త తెలిసి సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలే కరోనాబారిన పడి ఆయన త్వరలోనే కోలుకున్నారు.
గౌతమ్ మరణ వార్తతో సీఎం జగన్ సహా ఆయన కేబినెట్ సహచరులు, శ్రేణులు దిగ్భ్రాంతి చెందారు. జగన్ హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు.
ఇంగ్లండ్ లో ఉన్నత చదువులు చదివిన గౌతమ్ .. తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014 , 2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన్ని కేబినెట్లోకి తీసుకున్నారు జగన్. సౌమ్యుడిగా, మృదుస్వభావిగా గౌతమ్ పేరు తెచ్చుకున్నారు.
గౌతమ్ రెడ్డికి నివాళిగా ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఇవాళ రాత్రి ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణపల్లికి తరలించనున్నారు. అక్కడే అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.