ఆంధ్రప్రదేశ్ అప్పులఊబిలో కూరుకుపోతోందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వెల్లడించింది. ఏటేటా విపరీతంగా ఏపీ అప్పులభారం పెరుగుతోందని స్పష్టం చేసింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఆంధ్రప్రదేశ్ అప్పు 2,29,333.8 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 3,60,333.4 కోట్లకు చేరినట్లుగా లిఖితపూర్వకంగా కేంద్రం తెలిపింది.
2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గితే 2020-21 నాటికి 17.1 శాతం పెరుగుదల నమోదయింది. ఏపీ స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూనే ఉంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి 2014లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 42.3 శాతం ఉండగా ఆ తరువాత భారీగా తగ్గింది. 2015లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఉన్న అప్పులు 23.3 శాతం ఉండగా.. 2021 నాటికి ఏపీ స్థూల జాతీయోత్పత్తిలో 36.5 శాతంగా అప్పులు ఉన్నాయి.