ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం సామాన్యుడికి చేరువ అయ్యేందుకు చొరవ చూపిస్తున్నది. ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు నిత్యవసర వస్తువుల్ని చాలా చౌక ధరల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందుకోసం విప్లవాత్మకమైన మార్పుల్ని చేపడుతున్నారు.
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్య ప్రజలు సతమతమవుతున్న వేళ ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.180 (కేజీ) అమ్ముతున్న కందిపప్పు ధరను ఒకే నెలలో రెండు సార్లు నియంత్రించి ఇప్పటికే 160 రూపాయలు, 150 రూపాయలకు తగ్గించి అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు
తాజాగా రూ.67కే కిలో కందిపప్పు, రూ 17 రూపాయలకే అరకేజీ చక్కెర పంపిణీకి శ్రీకారం చుట్టారు .
రాష్ట్రములోని ఒక 1.49 కోట్ల కుటుంబాలకు కందిపప్పు, చక్కెర అందజేస్తున్నారు.
దీని ద్వారా నాలుగు కోట్ల 32 లక్షల మందికి లబ్ధి కలుగుతుంది. తెనాలి పట్టణంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం పాలన మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలకు నిత్యవసరాలు అందుబాటు ధరల్లో ఉంచేలా చూడాలని పౌర సరఫరాల శాఖకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో రెండుమార్లు బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించేలా చూశాము. రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లో కిలో కందిపప్పు దేశవాళీ రకం రూ.150కి, బియ్యం (స్టీమ్డ్ – బీపీటీ/సోనా మసూరి) రూ.48, బియ్యం (పచ్చి – బీపీటీ/సోనా మసూరి) రూ.47కి విక్రయించేలా చూశాము. ఇప్పుడు రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదార కూడా అందుబాటులోకి తీసుకువచ్చాము. కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఒకటే – ప్రజలకు, పేదలకు నిత్యవసరాలు అందుబాటు ధరల్లోకి తీసుకురావడమే. అదే విధంగా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న ప్రజలకు నిత్యవసరాలు ఇచ్చేలా శాఖను సన్నద్ధం చేసింది మా కూటమి ప్రభుత్వం. ఇటీవల సంభవించిన వరదల సమయంలో బాధితులకు బియ్యం 25 కేజీలు, నూనె 1 లీటరు, పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, ఉల్లిపాయలు 2 కేజీలు, ఆలుగడ్డ 2 కేజీలు అందించాము” అన్నారు.
కూటమి ప్రభుత్వంతో సామాన్య ప్రజలకు నేరుగా ఉపయోగపడే పంచాయతీరాజ్ మరియు పౌరసరఫరాల శాఖను జనసేన పార్టీ తీసుకుంది. పౌర సరఫరాల శాఖ ద్వారా సామాన్యుడికి దగ్గర అయ్యేందుకు అనేక చర్యలను చేపడుతున్నారు.