సంక్రాంతి పండక్కి తన నియోజకవర్గానికి వెళ్లి తీరతానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రకటించడంతో ఏపీ సీఐడీ పోలీసులు ఆయనింటికి వెళ్లారు. ఆయనమీద ఉన్న దేశద్రోహం, రాజద్రోహం కేసుల విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. ఈనెల 17న విజయవాడలోని తమ కార్యాలయంలో హాజరుకావాలంటూ గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులిచ్చింది సీఐడీ బృందం. అయితే ఆ సమయంలో రఘు రామ ఇంట్లో లేరు. ఆ నోటీసులు తాను తీసుకుంటానని రఘురామ కుమారుడు అంటే సీఐడీ అంగీకరించలేదు. వాళ్లు వెళ్లిపోబోతుండగా ఇంటికి వచ్చిన రఘురామ సంతకం చేసి నోటీసు అందుకున్నారు. పండగ ముందురోజు ఇంటికొచ్చి నోటీసు ఇవ్వడం కక్షసాధింపు కాక మరేంటని రఘురామ మండిపడ్డారు. పాలకుల తప్పుల్ని ఎత్తిచూపితే రాజద్రోహం పెడతారా అని జగన్ పై ఫైరయ్యారు. హిందువులకు సంక్రాంతి చాలా పెద్ద పండగని…ఆ విషయం సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు తెలియకపోవచ్చు… జగన్ కైతే అసలే తెలిసి ఉండకపోవచ్చు అని రఘురామ వ్యాఖ్యానించారు.