ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలకు చేరువ అయ్యేందుకు భారతీయ జనతా పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నది. ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రి నారా లోకేష్ ప్రతిరోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంగళగిరి కేంద్రంగా ఉదయం ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. అక్కడికక్కడే వాటి పరిష్కారం కోసం ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా ఆదరణ లభిస్తోంది. ఈలోగా జనసేన పార్టీ నుంచి కూడా ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చి జనసేన కార్యకర్తలు నేరుగా ఫిర్యాదులు వినతిపత్రాలు సమర్పించవచ్చు అని సూచన చేశారు.
ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారధి పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకుంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా దీనిని నిర్వహిస్తారు. ప్రజా సమస్యల పట్ల పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తారు.
బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తారు. ప్రజా ప్రతినిధులను ప్రత్యక్షంగా ఈ వారధి కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తారు.
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. రోజుకొక ప్రజాప్రతినిధి ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఆ సమస్యలను క్రోడీకరించి సంబంధిత ప్రభుత్వ విభాగానికి పంపించేందుకు ఏర్పాటు చేసారు. దానికోసం ప్రత్యేకంగా తయారుచేసిన సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేశారు.
మొత్తం మీద ఇటువంటి కార్యక్రమాల ద్వారా భారతీయ జనతా పార్టీ నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.