కర్నాటక లో సిద్ధ రామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం మరో ఎత్తుగడ కు పాల్పడుతోంది. ఈ సారి పబ్లిక్ కాంట్రాక్టులలో ముస్లింలకు కోటా ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. దీని మీద త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కర్నాటక వార్తా పత్రికలలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
కోటి రూపాయల విలువైన సివిల్ కాంట్రాక్టులలో ముస్లింలకు కోటా అమలు చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటక సివిల్ వర్క్స్ కాంట్రాక్టులలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు కోటా అమలు అవుతోంది. మొత్తంగా 43 శాతం మేర కాంట్రాక్టులను ఈ వర్గాలకు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో క్రైస్తవం పుచ్చుకొన్న వారి కోసం ప్రత్యేకంగా కొంత కోటా నడుస్తోంది. ఇప్పుడు ముస్లింలకు మరో నాలుగు శాతం కోటా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఈ కోటా 47 శాతం కు చేరుతుందని అంచనా.
మొదటి నుంచి ముస్లింలు, క్రైస్తవుల ఓటు బ్యాంక్ కోసం సిద్ధ రామయ్య ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. గతంలో కూడా ముస్లింలకు ఇదే మాదిరి కోటాను అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ కోటాను రద్దు చేసి, వెనుక బడిన వర్గాలకు ఆ కోటాను బదలీ చేసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ముస్లింలకు ఆ మేరకు కోటాను అందచేసింది.
ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కాంగ్రెస్ సర్కార్ ముస్లిం కోటాను తెర మీదకు తెస్తోందని ప్రతిపక్ష బీజేపీ పార్టీ విమర్శిస్తోంది. కొంత కాలంగా సిద్ద రామయ్యను ముఖ్యమంత్రిగా తప్పిస్తారు అని ప్రచారం జరుగుతోంది. ఇటువంటప్పుడు మైనార్టీలను నెత్తిన పెట్టుకొనే నిర్ణయాలు అమలు చేస్తే… కాంగ్రెస్ అధిష్టానం.. సీటును కాపాడుతుంది అన్న ఉద్దేశ్యంతో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెబుతున్నారు.