ప్రాణాంతక మహమ్మరి కరోనాను ప్రపంచానికి అంటించిన చైనా…మరో ముప్పునకు కారణమవుతోంది. చైనా ప్రయోగించిన రాకెట్ ఒకటి భూమిపై కూలేందుకు వస్తోంది. మే 8న రాకెట్ శకలాలు భూమిమీద పడవచ్చని అంచనా వేస్తున్నారు. లాంగ్ మార్చ్ 5 బీ శకలాలు న్యూయార్క్, బీజింగ్, చిలీ, న్యూజిలాండ్, మాడ్రిడ్ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ది గార్డియన్ కథనం పేర్కొంది.
అటు భూమివాతావరణంలోకి ప్రవేశిస్తున్న చైనా రాకెట్ శకలాల్ని ట్రాక్ చేస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. రాకెట్ మార్గాన్ని అమెరికా స్పేస్ కమాండ్ పరిశీలిస్తోంది. అయితే భూమిపై ఆ శకలాలు ఏ ప్రాంతాల్లో పడతాయో ఇప్పుడే నిర్థారించలేమని కొన్నిగంటల ముందు మాత్రమే చెప్పగలమనీ పెంటగాన్ స్పేస్ కమాండ్ సెంటర్ తెలిపింది. ఈనెల 8న భూమిమీద చేరవచ్చని మాత్రం అంచనా వేస్తున్నామని…అప్పటివరకు రాకెట్ లొకేషన్ వివరాలు వెల్లడిస్తామంది.
ఓ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి చైనా ప్రయోగాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఏప్రిల్ 29న లాంగ్ మార్చ్ 3 బీ రాకెట్ ను…తియన్హే స్పెస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోని చేర్చింది. ఆ రాకెట్ శకలాలు పొరపాటున తాత్కాలిక కక్షలోకి చేరాయి. అవిప్పుడు భూమ్మీద పడబోతున్నాయి. అయితే ఎక్కడ పడతాయో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అసలైతే రాకెట్ ప్రయోగాలు చేసినప్పుడు విఫలమైతే వాటి శకలాలు సముద్రంలో పడేలా చూస్తారు. కానీ ఇప్పుడు చైనా రాకెట్ శకలాలు మాత్రం భూమ్మీదకు దూసుకొస్తున్నాయట.
గతంలో ఓసారి కూడా చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ రాకెట్ ఐవరీ కోస్టు లోని జనావాసాలపై పడి చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. అప్పుడు లోహపు ముక్కలు చల్లాచెదురుగా పడ్డాయి కానీ అప్పటికే అప్రమత్తం అవడం వల్ల ప్రాణాపాయం తప్పింది.