ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో రాష్ట్రంలో మరో పార్టీ పురుడుపోసుకుంది. సంయుక్త కిసాన్ మోర్చాలో భాగమైన..మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న 22 రైతు సంఘాలు కలిసి రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలోని మొత్తం 117 స్థానాలకూ పోటీ చేస్తామని పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఆమ్ ఆద్మీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్లే యోచనలో ఉన్న పార్టీ ముఖ్యులు ఇప్పటికే ఆప్ నాయకులతో చర్చలు జరిపినట్టు తెలిసింది.
సంయుక్త కిసాన్ మోర్చాలోని 32 సంఘాల్లో 25 సంఘాలు రాజకీయ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే ఇవాళ 22 సంఘాలే సంయుక్త సమాజ్ మోర్చా పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో 3 సంఘాలు ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
పార్టీలో చేరని సంఘాల్లో BKU (Dakound) , BKU (లఖోవాల్) ఉన్నాయి. ఎన్నికల రాజకీయాల్లో అస్సలు పాలుపంచుకోవద్దనుకుంటున్న ఏడు సంఘాల్లో కీర్తి కిసాన్ యూనియన్, క్రాంతికారి కిసాన్ యూనియన్…బీకేయూ క్రాంతికారి, దోబా సంఘర్ష్ కమిటీ, బీకేయూ సిద్ధూపూర్, కిసాన్ సంఘర్ష్ కమిటీ, జై కిసాన్ ఆందోళన్ ఉన్నాయి.