రైల్వే రవాణాలలో దూసుకెళుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే వందే భారత్ వంటి అత్యాధునిక సేవలను అందిస్తూ ప్రజల మనసుని చూరగొంటున్నది. అదే తరహాలో మరింత పురోగతి సాధిస్తుంది.
తాజాగా భారతీయ రైల్వేలు హైపర్ లూప్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాయి. చెన్నై సమీపంలో 410 మీటర్ల హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తయ్యింది. ఐఐటీ మద్రాస్, రైల్వే శాఖ కలిసి ఈ ట్రాక్ను నిర్మించాయి. అధునాతన హైపర్లూప్ సాంకేతికతను దేశంలో అభివృద్ధి చేసేందుకు ఐఐటీ మద్రాస్లో ‘ఆవిష్కార్’ పేరుతో 76 మంది విద్యార్థులతో కూడిన ప్రత్యేక బృందం, ఐఐటీ మద్రాస్లోనే స్థాపించిన ‘టూటర్’ అనే స్టార్టప్ పని చేస్తున్నాయి. టెస్ట్ ట్రాక్ పూర్తి కావడంతో ఈ సాంకేతికతను పరీక్షించడం కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
హైపర్లూప్ పాడ్లు మధ్యలో ఎలాంటి స్టాప్లు లేకుండా ఆరంభ స్టేషన్ నుంచి గమ్యస్థానానికి ప్రయాణిస్తాయి. అందుకే వీటిని ఇంటర్ సిటీ ట్రాన్స్పోర్ట్గా ఏర్పాటుచేసేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దేశంలో ముంబై-పుణె కారిడార్లో మొదటి హైపర్లూప్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఈ వ్యవస్థ ద్వారా ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. రోడ్డు ప్రయాణానికి మూడు గంటలు పట్టే ఈ రెండు స్టేషన్ల మధ్య హైపర్లూప్లో 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఆ తర్వాత చెన్నై – బెంగళూరు, ఢిల్లీ – చండీగఢ్ మధ్య కూడా హైపర్లూప్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. పుణెకు చెందిన క్విన్ట్రాన్స్ హైపర్లూప్ అనే అంకుర సంస్థ కూడా హైపర్లూప్ కార్గో వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నది.
హైపర్లూప్ అనే హైస్పీడ్ రవాణా వ్యవస్థ ఆలోచన 2012లో మొదటిసారి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మదిలో పుట్టింది. తక్కువ పీడనం ఉండే ట్యూబ్(భారీ పైప్లైన్ లాంటిది)లో చిన్న పాడ్(రైలు బోగీ లాంటిది)ల ద్వారా ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఒక్కో పాడ్లో 24 నుంచి 28 మంది ప్రయాణించవచ్చు.