మొన్నటికి మొన్న ఆదాయపు పన్ను శ్లాబ్ లలో మార్పు చేసి కేంద్ర ప్రభుత్వం భారీగానే శుభవార్త వినిపించింది. ఏడాదికి 12 లక్షల రూపాయల దాకా ఆదాయపు పన్ను లేదంటూ చల్లటి కబురు చెప్పింది. ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యపోయే మాదిరిగా తీపి కబురు వినిపించింది. ఇప్పుడు జీఎస్టీ రేట్లు తగ్గిస్తామంటూ ఫీలర్లు వదులుతోంది.
త్వరలోనే జీఎస్టీ రేట్లు తగ్గిస్తామంటూ స్వయంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మల ఛైర్మన్గా ఉండే జీఎస్టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. జీఎస్టీ శ్లాబ్ల సంఖ్యను తగ్గించి, జీఎస్టీ రేట్లలో మార్పులు చేసేందుకు పలువురు మంత్రులతో ప్రత్యేక బృందాన్ని జీఎస్టీ మండలి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జీఎస్టీకి సంబంధించి నాలుగు శ్లాబ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం చొప్పున జీఎస్టీ రేట్లను విధిస్తున్నారు.
లగ్జరీ ఉత్పత్తులు/సేవలు, సమాజానికి హాని కలిగించే వస్తువులపై 28శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలపై 5శాతం జీఎస్టీ వేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీపై నిర్ణయం తీసుకుంటున్నారనే ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ఖండించారు. ‘దేశ ప్రజల బాగును ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. అందుకే ఈ మార్పులన్నీ చేస్తున్నారు’ అని చెప్పారు.
కాగా, పాత పన్ను విధానాన్ని రద్దు చేసే ఆలోచనే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పన్నుల ఫైలింగ్ విధానాన్ని సరళతరం చేసే ఏకైక ఉద్దేశంతో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. కొత్తగా తీసుకురాబోయే ఆదాయపు పన్ను చట్టం గురించి ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రస్తావించారు.
1961లో తీసుకొచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు, చేర్పులతో కొత్త ఆదాయపు పన్ను చట్టం వస్తుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన బిల్లును మరికొద్ది రోజుల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదిస్తామని నిర్మల వెల్లడించారు.
మొత్తం మీద జీఎస్టీ రేట్లలో తగ్గింపు కబురు త్వరలోనే వినిపిస్తామంటూ కేంద్రం సంకేతాలు పంపిస్తోంది.