కర్ణాటక రాష్ట్రంలోని పాఠశాలలో హిజాబ్ తర్వాత మరో వివాదం రాజుకుంది. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ తమ విద్యార్థులను పవిత్ర గ్రంథం బైబిల్ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేదని తల్లిదండ్రుల నుంచి హామీ తీసుకుంది. ఈ కొత్త ఆదేశం కర్ణాటక విద్యా చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఉందని కొన్ని హిందూ సమూహాల నుంచి ప్రతిస్పందనలు వచ్చాయి. అంతేకాదు, విద్యార్థులు తప్పనిసరిగా తమ పాఠ్యపుస్తకాలతో పాటు బైబిల్ ప్రతిని తమతో ప్రతి రోజు తప్పనిసరిగా పాఠశాలకు తీసుకు వెళ్ళవలసిందే.
పాఠశాలలో క్రైస్తవేతర విద్యార్థులను బైబిల్ చదవాలని ఒత్తిడి చేస్తున్నారని హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్గౌడ ఆరోపించారు. పాఠశాలలో క్రైస్తవేతర విద్యార్థులు కూడా ఉన్నారని, వారిపై బైబిల్లోని బోధనలను బలవంతంగా నేర్చుకునేలా ఒత్తిడి చేస్తున్నారని హిందూ జన జాగృతి పేర్కొంది. “ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 & 30 ఉల్లంఘన. విద్యా సంస్థలు ఏ విద్యార్థులపైనా మతపరమైన బోధనలను అమలు చేయకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి” అని మోహన్ గౌడ స్పష్టం చేశారు.
అయినప్పటికీ పాఠశాల తన వైఖరిని సమర్థించుకుంది. తాము బైబిల్ ఆధారిత విద్యను మాత్రమే అందజేస్తామని పాఠశాల స్పష్టం చేసింది. పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులో, నెం. 11 అంశంలో ఈ విధంగా పేర్కొన్నారు: “మీ బిడ్డ వారి స్వంత నైతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఉదయం అసెంబ్లీ స్క్రిప్చర్ క్లాసులు, క్లబ్లతో సహా అన్ని తరగతులకు హాజరవుతారని, బైబిల్ను తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేదని మీరు ధృవీకరిస్తున్నారు.”
చాలా సంవత్సరాలుగా ఈ ఆచారం అక్కడ ఉందని చాలా మంది క్రైస్తవ మత పెద్దలు పేర్కొన్నారు. బిషప్ ఆఫ్ సౌత్ ఇండియా రెవ. డాక్టర్ ప్రసన కుమార్ శామ్యూల్ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ, “క్లారెన్స్ పాఠశాలల్లో బైబిల్ చదవాలనే ఒత్తిడి చాలా కాలంగా ఉంది, ఇది ఇప్పుడు కొత్తది కాదు. వారు దానిని ఆ సంస్థలో ఎందుకు తప్పనిసరి చేస్తున్నారో మాకు తెలియదు. ముస్లింలు, క్రిస్టియన్లు మరియు హిందువుల తల్లిదండ్రులు అందరూ బైబిల్ తీసుకుని, బైబిల్ చదువుతామని హామీ ఇచ్చారు” అని చెప్పారు.
ఈ విషయమై హిందూ జనజాగృతి సమితి ప్రాథమిక విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం తమ ఫిర్యాదుపై చర్య తీసుకోకపోతే, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేస్తామని ప్రకటించారు. “మేము ముందుకు వెళ్లి కర్ణాటక విద్యా శాఖకు ఫిర్యాదు చేస్తాము. వారు చర్యలు తీసుకోకపోతే, మేము పాఠశాలపై కోర్టులో పిఐఎల్ వేస్తాము,” అని మోహన్ గౌడ చెప్పారు.
కాగా, ఈ ఘటనపై తనకు తెలియదని, దీనిపై విచారణ జరుపుతానని కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. ఈ పాఠశాలను వందేళ్ల క్రితమే 1917లో బ్రిటిష్ క్రైస్తవ మిషనరీలు స్థాపించారు. బెంగళూరు నగరంలో తక్కువ ఫీజులతో, నాణ్యమైన విద్యను అందించే ప్రతిష్టాకరమైన పాఠశాలగా పేరొందడంతో అన్ని మతాలకు చెందిన వారు తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపిస్తున్నారు.
Courtesy :- Nijam Today
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)