ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ… తాజా సప్లిమెంటరీ చార్జ్ షీట్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చింది. ఆయనతో పాటు కవిత, అరుణ్ రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు, అమన్ దీప్ దల్, అర్జున్ పాండేల పేర్లను ఛార్జ్ షీట్లో ప్రస్తావించింది. దర్యాప్తులోని కీలక అంశాలనూ చేర్చింది. గత నవంబర్ లో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటే సిసోడియాను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురిని ప్రశ్నించారు.
మరోవైపు లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి తనకు ఇచ్చిన తాత్కాలిక బెయిల్ గడువును పొడిగించాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఏప్రిల్ 1న కోర్టు ఆయనకు 4 వారాల తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. అయితే ఆ గడువు ముగియనుండటంతో ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై విచారణకు ఓకే చెప్పిన రౌస్ ఎవెన్యూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేసింది.