
Supreme Court of India
లైంగిక దాడి కేసులో అమ్మాయిలకు నిర్వహించే టూ ఫింగర్ టెస్టును నిషేధించింది సుప్రీం కోర్టు. టెక్నాలజీ ఇంతగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఆ పరీక్ష అనుచితమని..బాధితులను మరింత క్షోభ పెట్టడమేనని అభిప్రాయపడింది.
రెండు వేళ్ల పరీక్ష అనేది మహిళల గోప్యత, గౌరవ మర్యాదలకు భంగం కలిగించేదేనని… బాధితులకు ఈ పరీక్షను చేయడం అంటే..ఆమెపై మరో అఘాయిత్యం జరిగినట్టు భావించాలని ధర్మాసనం స్పష్టంచేసింది.
ఇంకా పాత విధానంలోనే అత్యాచార బాధితులను పరీక్షించడమేంటని ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు… మహిళల గౌరవానికి భంగం కలిగించే రెండు వేళ్ల పరీక్ష జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన ఓ నిందితుడిని జార్ఖండ్ హైకోర్టు నిర్దోషిగా విడిచిపెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. దోషిగా నిర్ధారించిన ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఇదే క్రమంలో టూ ఫింగర్ టెస్ట్ పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.అంతేకాదు అశాస్త్రీయమైన ఈ దర్యాప్తు పద్ధతిని వైద్యపుస్తకాల్లోంచి తొలగించాలనీ ఆదేశించింది. ఇకపై టూ ఫింగర్ టెస్ట్ నిర్వహించినవారు దోషులవుతారని, శిక్షార్హులవుతారని హెచ్చరించిం కోర్టు.
అసలు టూ ఫింగర్ టెస్ట్అంటే ఏంటి? ఏంటంటే… అత్యాచారం ఆరోపణలను పరిశోధనల్లో ఇదొక పరీక్షా ప్రక్రియ. ఇందులో బాధితురాలి జననాంగంలోకి రెండు వేళ్లను చొప్పించి ఈ పరీక్షను నిర్వహిస్తారు. గతంలో ఆమెకు శారీరక సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వైద్యులు ఈ పరీక్ష జరుపుతారు. అందులో భాగంగా.. ఇందులో జననేంద్రియంలోని కండరాల ఫ్లెక్సిబిలిటీ, హైమెన్ను పరీక్షిస్తారు. హైమెన్ అంటే కన్నెపొర. అది ఉన్నట్టైతే ఆమె గతంలో ఎవరితోనూ శారీరకసంబంధం సాగించలేదని నిర్ధారిస్తారు. హైమన్ దెబ్బతింటే ఆమె లైంగికసంబంధంలో పాల్గొన్నట్టు. అయితే ఇది పూర్తిగా శాస్త్రీయమైనదికాదని..హైమన్ చిరగడానికి వేరే కారణాలూ ఉంటాయనీ నిపుణుల వాదన.
యుక్తవయసుకు వచ్చిన అమ్మాయిలకు యోనిలో ఒక పొర ఉంటుంది. లైంగిక ప్రక్రియలో పాల్గొన్నప్పుడు అది చిరిగిపోతుంది.అయితే క్రీడాకారులు, ఇతరత్రా శారీరకంగా చురుగ్గా ఉండేవాళ్లకూ హైమన్ దెబ్బతినే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతారు.