తమిళనాడు బీజేపీ అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలైకు సుప్రీంకోర్టులో ఉరట లభించింది. ఆయన మీద దాఖలైన క్రిమినల్ కేసు విచారణకు సంబంధించిన స్టే ను సెప్టెంబర్ నెల 9వ తేదీ దాకా పొడిగించారు. సోషల్ మీడియాలో ముక్కుసూటిగా మాట్లాడే నాయకుడిగా అన్నామలైకు పేరుంది. ఇదే క్రమంలో 2022 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన అంటే… దీపావళికి రెండు రోజులు ముందు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతర్జాతీయ నిధులు అందుకుంటున్న ఒక ఎన్జీవో దీపావళి మీద బురద జల్లుతోందని, బాణసంచా కాల్చకుండా హిందువుల అడ్డుకుంటోందని, ఇందుకోసం కోర్టులలో పిటిషన్ లు వేస్తోందని వ్యాఖ్యానించారు. దీని మీద స్థానిక ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అన్నామలై వ్యాఖ్యలతో ఉద్రిక్తత లు రేగుతాయంటూ ఈ పిటిషన్ లో ఆరోపించారు.
ఈ కేసు విచారణను నిలిపివేయాలంటూ అన్నమలై దాఖలు చేసుకున్న పిటిషన్ ని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. దీనిమీద ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదని, దీనిని బట్టే ఈ పిటిషన్ లో వాస్తవం లేదని అన్నామలై వాదించారు. ఉద్రిక్తతలు కోసం తాను మాట్లాడలేదని, హిందువుల తరపు ఆవేదన వెలిబుచ్చానని ఆయన అన్నారు. ఈ వాదనలని పరిగణన లోకి తీసుకున్న సుప్రీంకోర్టు స్టే విధించింది.