అధికార పక్షంపై స్వరం పెంచారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. డీఎంకే ఫైల్స్ పేరిట అధికార పార్టీ నేతల అక్రమాల చిట్టా విప్పుతున్నారు. ముందు ప్రకటించినట్టుగానే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఉదయం 10.15గంటలకు డీఎంకే పార్టీ నాయకుల అక్రమ ఆస్తుల వివరాలు బయటపెట్టారు. తమిళనాడు రాష్ట్రాన్ని కరుణానిధి కుటుంబం విచ్చలివిడిగా దోచుకుందని, దోచుకుంటోందని ఆధారాలతో సహా వివరించారు.
‘ డీఎంకే ఫైల్స్ ‘ సిరీస్ లో భాగంగా…పార్ట్-1ని ఇవాళ విడుదల చేశామని అన్నామలై అన్నారు. ఏడాదిపొడవునా ఈ సిరీస్ కొనసాగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మనీలాండరింగ్ వ్యాపారంలో డీఎంకే ఎలా భాగం అవుతోంది అనేది అత్యంత ఆందోళనకరమైన విషయమన్నారు.27మంది డీఎంకే నేతల దగ్గరే 2 లక్షల కోట్ల కు పైగా ఆస్తులున్నాయని అన్నామలై అన్నారు. ఇది తమిళనాడు జీడీపీలో 10శాతం అని ఆయన ఇది కూడా ప్రత్యక్ష ఆస్తులు, పలు కంపెనీల్లో అధికార పార్టీ నేతల వాటాల గురించి మాత్రమేనని, ఇంకా ముందుకు వెళ్లలేదని స్పష్టం చేశారు.
డీఎంకే నేతలు కనిమొళి, కళానిధి మారన్, టీఆర్ బాలు, కలానిధి వీరసామి, దురైమురుగన్, కథీర్ అనంద్, ఆర్కోట్ వీరసామి, కళానిధి వీరసామి, కే పోన్ముడీ, జగట్రచ్చాగన్, ఈవీ వేలు, కేఎన్ నెహ్రూ తదితరుల ఆస్తులను అన్నామలై బయట పెట్టారు. అందుకు సంబంధించి వీడియోను సైతం ప్రదర్శించారు. అనంతరం స్టాలిన్ కు పలు ప్రశ్నలు సంధిస్తూ… 2006 – 2011 కాలంలో రెడ్ జెయింట్ సినిమాస్ రూ.300 కోట్లతో సినిమాలు తీశాయని, చాలా సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ వాటికి ఆదాయ వనరు ఏమిటో చెప్పాలన్నారు. స్టాలిన్ అల్లుడు శబరీషన్ తో జార్జ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీనివాస్ వెంకటేషన్ సంబంధాలపై నిలదీశారు. మంత్రులు ఉదయనిధి స్టాలిన్, అంబిల్ మహేశ్ పొయ్యమొళి డైరెక్టర్లుగా ఉన్న ఓ సంస్థతో స్టాలిన్ ఒప్పంది కుదుర్చుకున్నమాట నిజంకాదా అని ప్రశ్నించారు. టెండర్ ప్రక్రియపై కస్టమ్ డ్యూటీ విధించలేమని ఎగ్జిమ్ స్పష్టం చేసిన తర్వాత, మెట్రో ఫేజ్ 1 టెండర్తో కస్టమ్ డ్యూటీని ఎందుకు అనుబంధంగా చేర్చారని నిలదీశారు. 2011 ఎన్నికల ప్రచారానికి లంచానికి ప్రతిఫలంగా అప్పటి డిఎంకె ప్రభుత్వం అమెరికన్ కంపెనీ ఆల్స్టోమ్ కు అనుకూలంగా వ్యవహరించిందనీ తీవ్రఆరోపణలే చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరగాలన్నారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బ్యాడ్జితో మీడియా ముందుకు వచ్చారు. వీటి పైన మీడియా ప్రశ్నలకు ఏప్రిల్ 20, 21వ తేదీల్లో అందుబాటులో ఉంటానని అన్నామలై అన్నారు.
మరోవైపు అన్నామలై రిలీజ్ చేసిన వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మా ఆస్తుల విలువను మరీ 2 లక్షల కోట్లుగా చూపిస్తావా అని డీఎంకే నాయకులు ఆయనమీద పరువునష్టం దావా వేస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లకు బీజేపీలో ఒక గట్స్ ఉన్న నిజాయతీపరుడైన నాయకుడిని చూడగలుగుతున్నామని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐపీఎస్ ను వీడి రాజకీయాల్లో చేరి తనదైన మార్కుతో దూసుకుపోతున్న అన్నామలైకి తమిళనాడులో అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది.