ఆంధ్రాలో అపహాస్యమవుతున్న ప్రజాస్వామ్యం!
ఏకగ్రీవం పేరుతో ఏకఛత్రాధిపత్యం చెలాయించడానికి ఏపీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏకగ్రీవ నజరానాలను భారీగా పెంచడం వెనుక, కుట్ర కోణం ఉందంటోంది టిడిపి. ఏకగ్రీవం పేరుతో ఇతర పార్టీల వారు పోటీకి దిగకుండా అధికార బలంతో అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని గత ఏడాది కూడా ఆరోపణలు వచ్చాయి. కరోనా ఉధృతి వల్ల ఎస్ ఇ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆనాడు ఎన్నికలను వాయిదా వేసే సమయానికే భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాకుచెందిన ఒక సంఘటనపై పత్రికల్లోవార్తలు చక్కర్లుకొడుతున్నాయి. నల్లజర్ల మండలంలోని ఒక మేజర్ పంచాయతీలో ఒక ప్రముఖ పార్టీ తరఫున సర్పంచ్ పదవికి పోటీ పడే అవకాశం కోసం ఇద్దరు పోటీ పడ్డారు. సర్పంచ్ ఎన్నిక పార్టీలకు అతీతంగా జరుగుతుంది. కాబట్టి పార్టీ టికెట్ కాకుండా, అభ్యర్థిత్వం ఖరారు అనే దానికోసం ఒక పోటీదారు 15 లక్షల రూపాయలు పాట పాడాడట. అలాకాదు, ఇంకో 5 లక్షలు కలిపి 20 లక్షలు ఇవ్వాలని మధ్యవర్తిత్వం నెరపిన పార్టీ పెద్దలు సూచించారు. అలా, అక్షరాలా ఇరవై లక్షలకు బేరం కుదిరిందట. ఇలా సీట్లు కొనుక్కునే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తారా? నిజాయితీగా పనిచేస్తారా? అనేది ప్రశ్న.