ఆంధ్రా-తెలంగాణ ఒకే ర్యాంక్
సమీకృత అభివృద్ధి లక్ష్యాల (సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్) సాధనలో సంపన్న తెలంగాణ రాష్ట్రం లోటు బడ్జెట్ గల ఆంధ్రప్రదేశ్ తో సమానంగా లిచింది. సారు చెప్పినంత వేగంగా తెలంగాణ దూసుకుపోవడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ కూడా మనతో సమాన వేగంతోనే వెళ్తున్నదని తేలింది.
నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం ఈ జాబితాలో కేరళ 70 స్కోర్ తో మొదటి ర్యాంకు సాధించింది. 69 పాయింట్లతో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానం సాధించింది. 67 పాయింట్లతో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (66), గోవా (65), సిక్కిం (65), గుజరాత్ (64), మహారాష్ట్ర (64) ఉన్నాయి. లోటు బడ్జెట్ గల ఏపీ, మిగులు బడ్జెట్ గల తెలంగాణ ఒకేర్యాంకు సాధించడం విశేషం. అనేక విషయాల్లో వందకు వంద శాతం మనమే నంబర్ వన్ అని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్తుంటారు. ఎస్ డి జి విషయంలో మాత్రం అంత సీన్ లేదని గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
తెలంగాణ స్థూల అభివృద్ధి సూచీలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, పాక్షిక మెదక్ జిల్లాలదే పైచేయి. ప్రస్తుత జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల వాటా తెలంగాణ స్థూల అభివృద్ధిలో 52 శాతం. ఈ అసమానతలను అధిగమించాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని కూడా నివేదిక తెలిపింది. ఇక, విద్యపై ప్రభుత్వ ఖర్చు జిఎస్ డిపిలో కనీసం 2 శాతం ఉండాలి. తెలంగాణలో అది 1.8 శాతం మాత్రమే.