ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కొత్త చిక్కు వచ్చి పడింది ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది దీంతో ఆపధర్మ ప్రభుత్వం అత్యవసర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రోజువారీ కార్యకలాపాలు ఇబ్బంది లేకుండా చూడటం మీద దృష్టి పెడుతున్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లిపోయారు. అక్కడ కుమార్తెలతో కాలం గడుపుతున్నారని, నెలాఖరు దాటాకే తిరిగి వస్తారని తెలుస్తోంది. అత్యవసరం అయితే తప్ప ఆయన్ని సంప్రదించి వీలు లేదు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారు. ఈ ప్రభుత్వంలో సీఎం జగన్,, ఆయన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మంత్రులు దాదాపుగా ఆయా మంత్రిత్వ శాఖలకే పరిమితం తప్ప, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా చాలా పరిమిత అధికారాలతో మంత్రులు కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీద పాలనా బాధ్యత నెలకొని ఉంది. ఈలోగా ఆయనకు రిటైర్మెంట్ సమయం ముంచుకుని వస్తోంది. దీంతో సహజంగానే ఆ పనుల మీద ఆయన ఉండిపోతున్నారు. ఎన్నికలు- ఫలితాలు మధ్య సమయం కాబట్టి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ లు కూడా పరిమితంగానే వ్యవహరిస్తున్నారు. జూన్ నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. 9, 10 తేదీల తర్వాత మాత్రమే కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉంది.
ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. 2014 సంవత్సరంలో జూన్ నెల 2వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం గా ప్రకటించారు. పది సంవత్సరాలు పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆవిర్భావ చట్టంలో తెలియజేశారు. ఈ గడువు కాస్త వచ్చే జూన్ రెండవ తేదీతో ముగుస్తోంది. అప్పటిదాకా మాత్రమే హైదరాబాద్ కు సంబంధించి కాస్తో, కూస్తో ఏపీ ప్రభుత్వానికి పట్టు ఉంటుంది. ఆ తేదీ దాటితే హైదరాబాదు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం చేతిలోనికి వెళ్ళిపోతుంది. ఇప్పటికే రాజధాని కార్యాలయాలు, సంబంధిత కార్యకలాపాలు ..ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయాయి అంతవరకు బాగానే ఉంది, కానీ కొన్ని ప్రభుత్వ భవనాలు షెడ్యూల్ 10 లోని ఉమ్మడి ఆస్తులు విషయం ఇంకా తేలలేదు. వేల కోట్ల రూపాయల విలువైన భవంతులు, ఆస్తులు ఇంకా ఉమ్మడిగానే ఉన్నాయి. ఉమ్మడి ఆస్తుల విభజనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొంతమేర కసరత్తు చేస్తోంది.
అయినప్పటికీ జూన్ నెల 2వ తేదీ దాటిన తర్వాత హైదరాబాద్ మీద పూర్తి గుత్తాధిపత్యం తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. అటువంటి అప్పుడు ఏపీ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుంది . తెలంగాణ ప్రభుత్వ పెద్దల దయాదాక్షిన్యాల మీద మాత్రమే ఆధారపడాల్సి ఉంటుంది .అటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు , ఇతర ఎన్నికలు పొంచి ఉన్నాయి. అటువంటి అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది .ఈ విషయంలో గట్టిగా ప్రయత్నం చేయాల్సిన ముఖ్యమంత్రి ప్రభుత్వ పెద్దలు చేతులు ఎత్తేసినట్లుగా కనిపిస్తోంది.