ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం కొలువు తీరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తాజాగా ఎన్నికైన ఎంపీలకు అవకాశం కల్పించారు. తెలంగాణ లో బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపి నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు అవకాశం కల్పించారు మిత్రపక్షం తెలుగుదేశం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్లకు మంత్రి పదవులు దక్కాయి. చాలా వడపోతల తర్వాత ఈ నాయకులకు ప్రమోషన్ లభించింది.
తెలంగాణ విషయానికి వస్తే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు దక్కాయి. అప్పటినుంచి కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. బిజెపిలో పట్టువదలని విక్రమార్కుడిలా .. పార్టీ కోసం కిషన్ రెడ్డి పని చేస్తూ వచ్చారు. వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన కిషన్ రెడ్డి పూర్తి సమయం కార్యకర్తగా బిజెపిలో అడుగు పెట్టారు. అట్టడుగు స్థాయి నుంచి పైకి ఎదుగుతూ వచ్చారు. ఒకప్పటి అగ్రనేత వెంకయ్య నాయుడు ప్రియ శిష్యుడుగా పేరుపొందారు. గతంలో బిజెపి అధ్యక్షునిగా బిజెపి శాసనసభ అధ్యక్షునిగా సేవలందించారు. మొన్నటి ఎన్నికల సమయంలో కూడా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు అందరూ ఊహించినట్లుగానే ఆయనకు మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది
తెలంగాణ బిజెపి కి ఒక ఊపు తెచ్చిన నాయకుడిగా ఎంపీ బండి సంజయ్ ని చెప్పవచ్చు. సుదీర్ఘకాలంగా తెలంగాణలో బిజెపి నిస్తేజంగా నిలిచి ఉన్నప్పుడు.. ఆయనకు పార్టీ అధ్యక్ష పగ్గాలు దక్కాయి. అధ్యక్షునిగా పనిచేసింది కొంతకాలం అయినా చాలా దూకుడుగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. పాదయాత్ర చేపట్టి గ్రామ గ్రామాన పార్టీ జెండా ఎగరేట్లు చేశారు. కరీంనగర్ జిల్లాలో చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బండి సంజయ్ … చట్టసభల్లో ప్రవేశించేందుకు సుదీర్ఘకాలంగా పోరాడుతూ వచ్చారు. బిజెపి అధ్యక్షునిగా కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేశారు. బండి సంజయ్ అధ్యక్షునిగా కొనసాగి ఉంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీసం పాతిక ముప్పై సీట్లు దక్కావని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఆయన్ని అధ్యక్షునిగా తొలగించడం మీద ఇంటా బయట తీవ్ర నిరసనలు వచ్చాయి. ఈ క్రమంలో బండి సంజయ్ కి న్యాయం చేసేందుకు, పార్టీ సేవలకు గుర్తింపుగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు.
తెలంగాణలో 8 మంది ఎంపీలుగా ఎన్నికైనప్పటికీ.. ఇందులో సగం మంది మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైన వారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్ వంటి నాయకులు మంత్రి పదవి ఆశించినప్పటికీ మొదటిసారి ఎంపీలు కావడంతో పక్కన పెట్టేసి తెలుస్తుంది. తర్వాత విస్తరణ కాలంలో వీరిలో ఒకరికి అవకాశం ఇస్తారు అని భావిస్తున్నారు.
అటు ఆంధ్రప్రదేశ్లో బిజెపి తరఫున ముగ్గురు ఎంపీలు ఎన్నికయ్యారు. పురందేశ్వరి సీఎం రమేష్ ఈ మధ్యకాలంలో పార్టీలోకి వచ్చారు. పురంధేశ్వరి కి స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి లేదా కేంద్రం లో బలమైన పదవిని ఇవ్వవచ్చు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షులు గా కూడా కొనసాగుతున్నారు. బిజెపి వర్మగా ప్రసిద్ధిగాంచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మొదటి నుంచి పార్టీకి పూర్తిస్థాయి నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో బిజెపి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న మొక్కవోని దీక్షతో పార్టీని అంటిపెట్టుకుని సేవ చేస్తూ వచ్చారు. చాలాసార్లు పార్టీ టిక్కెట్టు ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ సేవలను గుర్తించి కేంద్ర మంత్రి పదవి ఇచిన్నట్లు తెలుస్తోంది.
అటు తెలుగుదేశం పార్టీకి రెండు లేక మూడు మంత్రి పదవులు దక్కుతాయని ముందు నుంచి ఊహిస్తూ వచ్చారు. అప్పట్లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర మంత్రివర్గంలో కే ఎర్రం నాయుడు క్యాబినెట్ మంత్రిగా ఉండేవారు తర్వాత కాలంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా సేవలు అందించారు ఆయన ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన కుమారుడు రామ్మోహన్ నాయుడు అదే పందాలు కొనసాగించారు మూడుసార్లు ఎంపీగా ఎన్నికవ్వడంతోపాటు పార్లమెంటులో సమర్థవంతంగా పార్టీ వాణి వినిపించారు. చాలా చిన్న వయసులోనే ఉత్తమ పార్ల మెంటేరియన్ అవార్డు అందుకున్నారు. బీసీ వర్గాల నుంచి వచ్చిన రామ్మోహన్ నాయుడుకి ఇంగ్లీష్ హిందీ భాషల మీద అద్భుతమైన పట్టు ఉంది. టిడిపి తరఫున క్యాబినెట్ మంత్రి పదవి దక్కించుకున్నారు.
గుంటూరు ఎంపీ డాక్టర్ చంద్రశేఖర్ తండ్రి కూడా తెలుగుదేశంలో మొదటి నుంచి ఉన్నారు కుటుంబం మొత్తం టిడిపికి అంకితమైన పరిస్థితి. అమెరికాలో ప్రముఖ డాక్టర్ గా పేరు పొందిన చంద్రశేఖర్.. అక్కడ తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగాన్ని సమన్వయం చేసేవారు. తర్వాత కాలంలో గుంటూరు ఎంపీగా టికెట్ తెచ్చుకున్నాక.. బలమైన ప్రభంజనం సృష్టించే తరహాలో ప్రచారం కొనసాగించారు. అమరావతి రాజధాని చేయాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ ను మంత్రి పదవికి పంపించారు. పార్థసారథి, గంటి హరీష్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వంటి పేర్లు కూడా చర్చలకు వచ్చాయి. మంత్రివర్గ విస్తరణలో.. వీరిలో ఒకరిద్దరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.