తమిళనాడు కాంచీపురానికి చెందిన ఓ వ్యక్తి 2 కోట్ల విలువైన ఇంటిని విరాళంగా ఇచ్చాడు. అయితే అతనికి సంతానం లేదనుకుంటే పొరపాటు. తన ఇష్టానికి విరుద్ధంగా పిల్లలు క్రైస్తవమతంలోకి మారడమే కారణం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో హెల్త్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసి రిటైరైన వేలాయుధం కాంచీపురంలోని మునుస్వామి అవెన్యూలో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆయన వయసు 85ఏళ్లు. స్థానికంగా 2,680 చదరపు అడుగుల ఇల్లు ఉంది. దాని విలువ 2 కోట్లు. అయితే మతం మారిన పిల్లలు తాను చనిపోతే హిందు ఆచారం ప్రకారం కర్మకాండలు చేయరేమోననే అనుమానం వచ్చింది. దీంతో నిత్యం తాను పూజించే, ఇలవేల్పు కూడా అయిన కుమారకొట్టంలోని మురుగన్ ఆలయానికి విరాళంగా రాసిఇచ్చారు.
తన ముగ్గురు పిల్లలు తన ఇష్టానికి వ్యతిరేకంగా క్రైస్తవులను పెళ్లి చేసుకోవడమే కాక వాళ్లూ మతం మారారని హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేస్తారనే నమ్మకం లేదని వేలాయుధం వాపోయారు. అందుకే ఆలయానికి తన ఆస్తిని రాస్తున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం అతని ఇద్దరు పిల్లలు ఆ ఇంట్లోనే ఓ పోర్షన్లో ఉంటున్నారు. తాను, తన భార్య జీవించి ఉన్నంతకాలమే ఇంట్లో ఉంటానని…తమ మరణానంతరం ఆ ఇంటిని ఆలయ నిర్వాహకులు స్వాధీనం చేసుకోవాలని వాంగ్మూలం రాశారు వేలాయుధం. ఈ మేరకు సేల్ డీడ్ ను స్థానిక అధికారులు,ప్రజాప్రతినిధులకు అందజేశారు.
ఈమధ్య కాలంలో మతమార్పిళ్లు ఎక్కువయ్యాయి, అవి కొన్ని కుటుంబాల్లో కలహాలకు కారణమవుతున్నాయి. కర్నాటక ఎమ్మెల్యే జి. శేఖర్ తన తల్లి క్రైస్తవమతంలోకి మారిందని, తమ హిందువిశ్వాసాలను ఆచరించడం లేదని సాక్షాత్తూ సభలో వాపోయారు.
గత ఏడాది జూన్లో, గ్వాలియర్కు చెందిన ధరమ్ ప్రతాప్ సింగ్ ‘డేవిడ్’గా మారాడు, హిందూ ఆచారాల ప్రకారం తన తల్లిని దహనం చేయడానికి నిరాకరించాడు. ఆమె మనవరాలు 11 వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి అంత్యక్రియలు చేశారు.
2018లో, ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన థాబీర్ పాండా క్రైస్తవ మతం స్వీకరించి.. మతం మారడానికి నిరాకరించిన భార్యను, అత్తను చితకబాదాడు. ఇలా మతమార్పిళ్లకారణంగా కుటుంబాల్లో కలహాలు రేగుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా నిత్యం వెలుగుచూస్తున్నాయి.