అమూల్ పాల ఉత్పత్తి సంస్థ చేసిన ట్వీట్ కర్నాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బెంగళూరులో తాము ఆన్లైన్ వ్యాపారానికి సిద్ధమన్న సంస్థ ప్రకటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. పాల ఉత్పత్తి దారులు సైతం విరుచుకుపడ్డారు. రాష్ట్ర సొంత పాల ఉత్పత్తి దారుల సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే గుజరాత్కు చెందిన అమూల్ను తీసుకువస్తున్నారని అధికార పార్టీపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అయితే అలాంటిదేం లేదని …బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ అన్నారు. కర్ణాటకలోకి అమూల్ అడుగు పెట్టదని స్పష్టం చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2019 తర్వాత కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రూ.10 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు పెరిగిందని.. రూ.20 వేల కోట్లు రాష్ట్రంలోని పాడి రైతులకు చేరాయని ఆయన వివరించారు. గుజరాత్ చెందిన ఆనంది మిల్క్ యూనియన్ లిమిటెడ్ అమూల్ నాలుగురోజుల క్రితం ట్విట్టర్ వేదిగ్గా ప్రకటన చేసింది. ఈ ప్రకటనపై కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నేతృత్వంలోని ‘నందిని’ డెయిరీ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమూల్ రాష్ట్రానికి రాదని… ఆ విషయంపై రాజకీయం చేయవద్దని హితవు పలికారు.