నూతనంగా ఏర్పాటైన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీహార్ సీఎం నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను నియమించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 13 మందితో కూడిన స్టాండింగ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లు కూడా ఈ కీలక ప్యానెల్లో చోటు దక్కించుకున్నారు.
హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో కొత్త కూర్పు గురించి పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదంతో ప్యానెల్ను రీకాస్ట్ చేసినట్లు సమాచారం. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కు ప్రధానమంత్రి చైర్మన్ గా ఉన్నారు.
అమిత్ షా తోపాటు కమిటీలో కేంద్ర మంత్రివర్గంలోని మరో నలుగురు మంత్రులు.. ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు.
కేంద్ర మంత్రులైన నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, వీరేంద్ర కుమార్, గజేంద్ర సింగ్ షెకావత్ లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
కౌన్సిల్ పరిశీలనకు సంబంధించిన విషయాలపై స్టాండింగ్ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. ఇది ఇంటర్-స్టేట్ కౌన్సిల్లో పరిశీలనకు తీసుకునే ముందు కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అన్ని విషయాలను ప్రాసెస్ చేస్తుంది. కమిటీ సిఫార్సులపై తీసుకున్న నిర్ణయాల అమలును కూడా పర్యవేక్షిస్తుంది.