హమ్మో… అంబానీ ఆందానీ!!
చెడులో మంచి. ఈ మాట అబద్ధం కాదు నిజమే. ముఖ్యంగా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ విషయంలో నూటికి లక్ష కోట్ల పాళ్లు నిజ్జంగా నిజం. కరోనా కాలంలో చాలా మంది ఉద్యోగాలు ఊడాయి. మరికొంత మంది జీతాల్లో కోత పడింది. కొన్ని కార్ఖానాలు మూతపడ్డాయి. అంబానీ ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. అంబానీ గంటకు 90 కోట్ల రూపాయలు సంపాదిస్తాడట. అంటే ఒక అన్ స్కిల్డ్ కార్మికులు పది వేల సంవత్సారల్లో కూడా అంత సంపాదించ లేడు. ఇదే అంబానీ ఒక్క క్షణంలో సంపాదించే డబ్బును ఒక నైపుణ్యం లేని కార్మికుడు సంపాదించడానికి మూడేండ్లు పడుతుందట. ఆక్స్ ఫాం అనే సంస్థ తాజా పరిశీలన నివేదిక తేల్చిన వాస్తవాలివి. కరోనా కాలంలో అంబానీ గంటకు 90 కోట్లు సంపాదిస్తే ఇదే దేశంలోని 24 శాతం మంది నెలకు కేవలం 3 వేల రూపాయలు సంపాదించారు.
అంబానీ ఒక్కడి డబ్బుతో దేశంలోని 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు ఐదే నెలల పాటు పేదరికం అనేది తెలియకుండా బతకి అవకాశం ఉంది. ఒక్క అంబానీయే కాదు దేశంలోని వంద మంది కోటీశ్వరుల ఆదాయం కరోనా కాలంలో 35 శాతం పెరిగింది. వారి ఆస్తుల విలువ 12 లక్షల 97 వేల 822 కోట్లకు పెరిగింది. దీన్ని నిరుపేద భారతీయులకు పంచితే ఎంత వస్తుందో తెలుసా? ఒక్కొక్కరికి 94 వేల 45 రూపాయలు ఇవ్వవచ్చట.
ఇలా సంపన్నులు మరింత ఆదాయం కూడబెట్టిన దేశాల జాబితాలో భారత్ ర్యాంకు 6. టాప్ 5 దేశాల్లో అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ ఉన్నాయి. కమ్యూనిస్టు చైనాలో కూడా నంబర్ టు ర్యాంకు స్థాయిలో ఆర్థిక అసమానతలు ఉన్నాయట. ఇది అసమానతల వైరస్ అనే శీర్షికతో ఆక్స్ ఫామ్ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.