అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ అమెజాన్ పెద్దఎత్తున ఉద్యోగులను పంపేందుకు సిద్ధమైంది. వ్యయం తగ్గించుకునేందుకేనంటూ కొంతకాలంగా పలు కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఆవరుసలో తాజాగా అమెజాన్ చేరింది. ఉన్నపళంగా పదివేలమందిని తొలగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ వారంలోనే అది జరగనుంది. బుధవారమే ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ అమెజాన్ అధికారికంగా ఎలాంటి చేయలేదు. అయితే ఉద్యోగుల కోత మాత్రం నిజమని ప్రకటించింది. సంస్థలో ఆర్థికంగా ఏర్పడిన అనిశ్చితి కారణంగా వర్క్ఫోర్స్ను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది.
అదేసమయంలో ఉద్వాసనకు గురైన వారికి మరో ఉద్యోగం చూసుకునేవిషయంలో అండగా ఉంటామంది కంపెనీ. కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు రెండు నెలల సమయం ఇచ్చింది. ఒకవేళ.. ఆ రెండు నెలల్లో కూడా కొత్త ఉద్యోగం లభించకపోతే కొంత ప్యాకేజీ ఇవ్వాలనుకుంటోంది. అమెజాన్ తో ఫాటు మెటా కూడా గత వారం పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫేస్బుక్లో పనిచేస్తున్న 11,000 మంది ఉద్యోగులు గత వారం ఉద్యోగం కోల్పోయారు. అంటే దాదాపు 13 శాతం మంది ఉద్యోగులను ఫేస్బుక్ యాజమాన్యం ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి పీకేసింది.ఇక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పేరుతో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తాజాగా కొందరు ఉద్యోగులను ఇంటికి పంపింది.మరికొన్ని కంపెనీలు సైతం అదే పనిచేస్తున్నాయి.
ఐటీరంగంలో తలెత్తిన మాంద్యం ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తోంది. ప్రముఖ సంస్థలే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే తమ సంస్థల పరిస్థితేంటో అని చిన్న సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.ఇక ఐటీరంగంలో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియలో ఎక్కువగా నష్టపోతున్నది భారతీయులే.