ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఘనవిజయం సాధించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకునే మొదటి నిర్ణయాల మీద ఆసక్తి నెలకొంది. అమరావతి రాజధాని కోసం కలలు కన్న చంద్రబాబు… ఆ దిశగా అడుగులు వేస్తారని తెలుస్తోంది. ఇందుకు తగినట్లుగా ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో సందడి మొదలైంది.
అమరావతిని రాజధానిగా నిలపాలి అంటే కొంత న్యాయపరమైన ప్రక్రియ అవసరం. ఇప్పటికే ఈ విషయం మీద అనేక పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి. అందుచేత ఇందులో సుప్రీంకోర్టు ప్రమేయం అవసరం అయ్యేట్లుగా ఉంది.
ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా కీలకంగా నిలుస్తుంది అయితే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం కూడా భాగస్వామ్య పార్టీగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని తన వైపు తిప్పుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా అమరావతికి మద్దతుగా ఉన్నారు కాబట్టి ఈ పని తేలికవుతుంది.
అమరావతి రాజధాని కోసం మంత్రివర్గం తీర్మానం అవసరం అందుచేత కొత్త మంత్రివర్గం ఏర్పాటు కాగానే ఈ దిశగా అడుగులు పడతాయి. నూతన మంత్రివర్గంతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అందులో అమరావతికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన చేసిన అప్పీల్ ను ఉపసంహరించుకొనేలా న్యాయ పరమైన అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సుప్రీంలో కేసు ఉపసంహరణ తరువాత అసెంబ్లీలో రాజధాని పైన తీర్మానం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన న్యాయసలహాల మేరకు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకొని.. అమరావతి రాజధానిగా అధికార ప్రక్రియ పూర్తి చేసేలా సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తమ్మీద చంద్రబాబు నాయుడు అమరావతి ని రాజధాని చేయడం ఖాయంగా కనిపిస్తోంది.