వచ్చే ఏడాది జరిగే యూపీ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్లీ కమలం పార్టీ విజయం దుందుభి మోగించనుందని తాజా సర్వేలు తేల్చాయి. పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ వెనకబడి ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది మొదట్లోనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికలున్నాయి. నాలుగురాష్ట్రాలనూ భారతీయ జనతాపార్టీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సీఓటర్ సర్వే చెబుతోంది.
పంజాబ్లో అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించనున్నట్లు ఏబీపీ సీఓటర్ సర్వే పేర్కొంది. పంజాబ్ లో కాంగ్రెస్ 38-46 సీట్లు, ఆప్ 51-57 సీట్లు గెలుస్తుందని ఏబీపీ-సీఓటర్ తెలిపింది. ఇక దేశంలో అతిపెద్ద కీలక రాష్ట్రం యూపీలో బీజేపీ ప్రాబల్యం కాస్త తగ్గినట్టు అనిపించినా తిరిగి అధికారం మాత్రం ఆ పార్టీదేనని సర్వే తెలిపింది. కాస్త సీట్లు తక్కినా అధికారం మాత్రం దక్కించుకుంటుందన్నది సర్వే సారాంశం. బీజేపీ 259 నుంచి 267 నుంచి గెలుస్తుందని అంచనా వేసింది. ఇక 109 నుంచి 117 సీట్లు గెలుచుకుని రెండో పెద్దపార్టీగా ఎస్పీ ఉంటుందని… బీఎస్పీకి 12 నుంచి 16 సీట్లు దక్కవచ్చంటున్న సర్వే… కాంగ్రెస్ కు 3 నుంచి 7 సీట్లు వస్తాయంటోంది. 44 శాతం మంది ముఖ్యమంత్రి యోగి నాయకత్వం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు సర్వే తెలిపింది.
గోవాను కూడా బీజేపీ తిరిగి దక్కించుకోనుందిట. 39. 4 ఓట్ల శాతంతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని… అదే సమయంలో ఆప్ 22.2 శాతం ఓట్లను దక్కించుకోవచ్చని సర్వే చెబుతోంది. బీజేపీకి 22 నుంచి 26 సీట్లు వస్తాయని వెల్లడించిన సర్వే,ఆప్కు 4 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 3 నుంచి 7 సీట్లకు పరిమితం కానుందిట.
మణిపూర్ ను సైతం బీజేపీ 40.5 ఓట్ల శాతంతో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంటుందని తెలిపిన సర్వే… కాంగ్రెస్ 34.5 శాతంలో రెండో స్థానానికి పరిమితం కానుందని స్పష్టం చేసింది. ఇక్కడ బీజేపీకి 32 నుంచి 36 సీట్లు, కాంగ్రెస్ 18 నుంచి 22 సీట్లు వస్తాయని పేర్కొంది.
70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి 46 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ 21 సీట్లు గెలుస్తుంది ఏబీపీ-సీఓటర్ తన సర్వే పేర్కొంది.