భారత సాయుధ బలగాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ చీఫ్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ బిఎస్ రాజు హాజరైన ఈ సమావేశం న్యూఢిల్లీలోని రక్షణ మంత్రి నివాసంలో జరిగింది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అధికారిక పర్యటనలో హైదరాబాద్లో ఉన్నందున సమావేశానికి హాజరు కాలేదు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా యువకులు తమ ఆందోళనను విరమించుకోవాలని రాజ్నాథ్ సహా త్రివిధ దళాధిపతులు విజ్ఞప్తి చేశారు, కొత్త మోడల్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
“మాజీ సైనికులతో సహా విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాత కొత్త పథకాన్ని ప్రారంభించాం.. రాజకీయ దుష్ప్రచారం వల్ల స్కీం పట్ల అపార్థం వ్యాప్తి చెందుతోంది. ఈ స్కీం సాయుధ బలగాలలో రిక్రూట్మెంట్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుంది. దీనిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. బహుశా ఇది కొత్త పథకం కాబట్టి ప్రజల్లో కొంత గందరగోళం ఉండవచ్చు” అని రాజ్ నాథ్ అన్నారు.