అగ్నిపథ్ పథకంపై రాజకీయాలు చేయడం మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.
ఎలాంటి సంప్రదింపులు లేకుండా తీసుకున్న నిర్ణయమేం కాదన్నారు. మాజీ సైనికులు, సహా అనేక మందితో విస్తృత చర్చలు జరిపిన తరువాతే పథకానికి రూపకల్పన చేసి అమలు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. దీనికోసం దాదాపు రెండేళ్లు చర్చలు జరిపామన్నారు. దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం యువత భవితతో ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రక్షణమంత్రి. దేశంలోని సైనికుల ఆత్మస్థయిర్యం దెబ్బతీసేలా, అవమానించేలా ప్రతిపక్షాల తీరు ఉందని రాజ్ నాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పథకం క్రింద నియమితులైనవారికి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారామిలిటరీ దళాలు చేపట్టే ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. అగ్నివీర్ అంటే రక్షణ దళాల్లోకి కొత్తవారిని తీసుకురావడం మాత్రమే కాదని, వారికి ప్రస్తుతం సైనికులకు ఇస్తున్న నాణ్యమైన శిక్షణతో సమానమైన శిక్షణను ఇస్తామని చెప్పారు.
సైనికుల నియామక ప్రక్రియలో ఈ పథకం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని చెప్పారు. ఈ పథకం క్రింద రక్షణ దళాల్లో నియమితులయ్యేవారికి శిక్షణ విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని…తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారాయన. రాజకీయాలు దేశహితం కోసం తప్ప నాశనం కోసం ఉండకూడదన్నారు.
అగ్నివీరులకు నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత రూ.11.71 లక్షల చొప్పున ఇవ్వడం గురించి మాట్లాడుతూ, వారు కొత్త సంస్థలను ఏర్పాటు చేయాలనుకుంటే, అవసరమైన రుణం తక్కువ వడ్డీ రేటుతో లభించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. నాలుగేళ్ళ సర్వీసు పూర్తయిన తర్వాత వీరికి ఉపాధి లభించే విధంగా పథకాలనూ రూపొందిస్తామని చెప్పారు.