అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాలలో భారీ నిరసనల మధ్య బీహార్ నుంచి తెలంగాణ వరకు రైల్వే ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేశారు. గత కొన్ని రోజులుగా టిక్కెట్ రద్దు చేసినందుకు ప్రయాణికులకు జరిగిన నశాతానికి తగిన డబ్బు తోపాటు టికెట్ రీయింబర్స్మెంట్తో మొత్తంగా భారతీయ రైల్వే ఇప్పటి వరకు రూ. 1,000 కోట్లకు పైగా నష్టాలను చవిచూసింది.
ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు, అలాగే డజన్ల కొద్దీ రైళ్లను తగులబెట్టారు. అంతకుముందు జూన్ 18న కేవలం నాలుగు రోజుల నిరసనలతో రూ.700 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రైల్వే పేర్కొంది. 60 కోట్లకు పైగా ప్రయాణీకుల టిక్కెట్లు రద్దు చేశామని రైల్వే అధికారుల తెలిపారు. రైల్వేకు గత కొన్ని రోజులుగా జరిగినంత ఆస్తి నష్టం దశాబ్ద కాలంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పటివరకు భారతీయ రైల్వేలు గత దశాబ్దంలో జరిగిన మొత్తం నష్టాల కంటే ఎక్కువ నష్టాలను చవిచూశాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక జనరల్ కోచ్ నిర్మాణానికి రూ.80 లక్షలు, స్లీపర్ కోచ్ కు రూ.1.25 కోట్లు, ఏసీ కోచ్కు యూనిట్కు రూ.3.5 కోట్లు ఖర్చవుతుంది. ఒక రైలు ఇంజన్ను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. 12 కోచ్ల ప్యాసింజర్ రైలు ధర రూ. 40 కోట్లు, 24 కోచ్ల రైలు ధర రూ. 70 కోట్లకు పైనే.
దేశంలో నిరసనలైనా, ఉద్యమమైనా రైల్వే ఆస్తులు తరచూ విధ్వంసానికి గురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆర్ఆర్బి-ఎన్టిపిసి పరీక్ష ఫలితాలపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు.
రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం నేరం, అలాంటి వ్యక్తులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 151లో దీనికి శిక్ష విధించే నిబంధన ఉంది.