అగ్నిపథ్ మంటలు తెలంగాణకు వ్యాపించాయి. నిరసనకారుల ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడికింది. అగ్నిపథ్ ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలంటూ… వేలాదిగా దూసుకువచ్చిన ఆందోళనకారులు వస్తూనే ఆగిఉన్న రైలుకు నిప్పంటించారు. మొదటి మూడు ఫ్లాట్ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ సహా మూడు రైళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. పార్శిళ్లను పట్టాలమీదపైకి విసిరి తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్ కు చేరుకుని ఆందోళనకారులను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అయితే ఆందోళనకారులంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరుగులు తీసి అక్కడ నిలిచి ఉన్న రైళ్లపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ , రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించాల్సి వచ్చింది. ఘర్షణల్లో ఓ యువకుడు చనిపోయాడు. వేలాది మందిగా ఉన్న యువకులను కంట్రోల్ చేయడంపోలీసులకు ఇబ్బందైంది. రైళ్ల అద్దాలను ధ్వంసం చేస్తుంటడంతో ఏమీ చేయలేక చూస్తుండిపోయారు.
రైల్వే స్టేషన్లో రణరంగం నేపథ్యంలో… అటువైపు వస్తున్న అన్ని బస్సులు, రోడ్లను బంద్ చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. కొందరు నడిచివెళ్లడం కనిపించింది. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర నుంచి ట్రాఫిక్ను, ఇటు బోయిన్పల్లి మదర్ తెరిసా స్టాచ్యూ దగ్గర నుంచి ట్రాఫిక్ ను దారి మళ్లించారు. అటు రైల్వేస్టేషన్ ముట్టడికి ఆందోళనకారులు పకడ్బందీ ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. ఐదు రోజుల నుంచి వాట్సప్ గ్రూపు్ల్లో కమ్యూనికేట్ చేసుకుంటూ వచ్చారు. ఈనెల 15నే గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్టు పోలీసులు నిర్థారించారు. ఆ ఒక్క రోజే మొత్తం వెయ్యి మంది జాయినైనట్టు తెలిసింది.
ముందు అనుకున్నట్టుగానే…దాదాపు 500మంది విద్యార్థులు గురువారం రాత్రే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకున్నారు. అసలైతే ఆర్మీ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ తో పోరాటం చేయాలని వారనుకున్నా… అగ్నిపథ్ స్కీం ప్రకటన తరువాత పెద్దఎత్తున ఆందోళన చేయాలనుకున్నారు. అందుకే వెంటనే వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు.
ఫోన్స్, మెసేజ్ల ద్వారా యువకులు అప్డేట్లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన యువకుడు వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ గా పోలీసులు గుర్తించారు. గాయపడిన మరికొందరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అటు అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే ఓ ప్రకటన విడుదల చేశారు. అగ్నిపథ్లో భాగంగా అగ్నివీరులుగా నియామకం కోసం వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలకు ప్రభుత్వం పెంచిందని చెప్పారు. శక్తి, సామర్థ్యాలు, దేశభక్తిగల యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నియామకాల ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. అగ్నివీరులుగా సైన్యంలో చేరే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని యువతను కోరారు.
అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ స్కీం విషయంలో ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు. రక్షణ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునేవారికి అగ్నిపథ్ గొప్ప సువర్ణావకాశం అని ఆయన అన్నారు. అగ్నిపథ్ పాలసీ కింద ఎంపికైనవారిని ‘అగ్ని వీరులు’గా గుర్తిస్తామని, నాలుగేళ్లపాటు సాయుధ బలగాల్లో వారు పనిచేయవచ్చని యువతకు రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గత రెండేళ్లలో నియామకాలు చేపట్టనందున ఇది మంచి అవకాశమని… యువత భవిత దృష్ట్యా వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్ల సంవత్సరాలకు సడలిస్తూ మోదీ సడలింపుఇచ్చారని అన్నారు. రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం రెండు రోజుల జమ్ముకాశ్మీర్ పర్యటనలో ఉన్నారు.