జమ్ము కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు మీద ప్రతిపక్షాలు ఇంకా గొడవ చేస్తూనే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 ని పునరుద్ధరిస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ కూడా ఇచ్చేసింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వీలు దొరికినప్పుడల్లా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నాయి.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొంది అని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన లెక్కలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటుకి సమర్పించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులను జైలుకు తరలిస్తామని, లేదంటే నరకానికే పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
రాజ్యసభలో మాట్లాడుతూ 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు దాదాపు 900 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేస్తామని తేల్చి చెప్పారు.
జమ్మూ కశ్మీర్లో గత కొద్దిరోజుల్లోనే 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు. ఈ దాడుల్లో కొందరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని మంత్రి సభకు వివరించారు.
ఉగ్రదాడులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా రాయ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. 2004 – 2014లో యూపీఏ ప్రభుత్వ హయాంలో జమ్మూకశ్మీర్లో 7,217 ఉగ్రవాద ఘటనలు జరిగాయని మంత్రి గుర్తు చేశారు. ఆ దాడుల్లో 2,829 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 67 శాతానికి తగ్గినట్లు చెప్పారు. 2014 నుండి ఈ ఏడాది జూలై 21 వరకూ జమ్మూ ప్రాంతంలో 2,259 ఉగ్రవాద ఘటనలు జరిగినట్లు వివరించారు. ఇవి కూడా జరగకూడదని, దురదృష్టవశాత్తు ఉగ్రదాడులు జరిగాయని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదని హితవు చెప్పారు.
ఇక ఎన్డీయే పాలనలో ఉగ్రవాద సంఘటనలు కూడా 69 శాతం తగ్గినట్లు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లో ప్రజలు ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని, భద్రతకు పూర్తి హామీ ఉందని సభలో వివరించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగు పడిందని స్పష్టం చేశారు. ఆర్టికల్ రద్దు అనంతరం రాళ్ల దాడి ఘటన చోటు చేసుకోలేదని చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి జులై 15వ తేదీ వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లలో 10 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మరణించారని తెలిపారు.
ఇక ఈ ఆర్టికల్ రద్దు తర్వాత.. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో శాంతి శకం అరంభమైందని చెప్పారు. అలాగే రాష్ట్రం పురోగామి దిశగా సాగుతున్నందని తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులతోపాటు ప్రభుత్వ సంస్థలన్నీ సజావుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఒకప్పటి పరిస్థితులను కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
గతంలో రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ఆందోళనలు, నిరసనలు, బంద్లు, రాళ్ల దాడులు నిత్యకృత్యంగా జరిగేవని గుర్తు చేశారు. దీంతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా ఉండేదని, కానీ నేడు ఆ పరిస్థితులు అయితే జమ్మూ కశ్మీర్లో లేవని స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు కోసం పోలింగ్ బూత్లకు పోటెత్తిన విషయం మరవరాదని గుర్తు చేశారు.
జమ్మూ కాశ్మీర్ కు దేశ ప్రజానీకం స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నారు అని కేంద్ర మంత్రి వివరించారు.
మరోవైపు జమ్మూ కశ్మీర్కు పర్యాటకులు భారీగా భారీ సంఖ్యలో పెరిగారని వివరించారు. అది కూడా 2023 ఏడాదిలో 2.11 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కశ్మీర్ అందాలను వీక్షించారని విశదీకరించారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలు సాంఘిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.