UPI లావాదేవీలు ఇకపై ఉచితం కాదని, ఆన్లైన్ లావాదేవీలకు రుసుము చెల్లించవలసి ఉంటుందని జరుగుతున్న ప్రచారం ఫేక్ అని తేలింది. ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనంటూ… యూపీఐని అభివృద్ధి చేసి, నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన అధికారిక ట్విటర్ ఖాతాలో వివరించింది.
యూపీఐ లావాదేవీలను నిర్వహించే కస్టమర్లు ఎటువంటి రుసుమును చెల్లించవలసిన అవసరం ఉండదని స్పష్టం చేస్తూ.. నిబంధనల ప్రకారం ఇంటర్ఛేంజ్ ఛార్జీలు ప్రీపెయిడ్ పేమెంట్ ఇస్ట్రుమెంట్స్ (PPI)లకు మాత్రమే వర్తిస్తాయనీ అంది. వాలెట్లు, క్రెడిట్ కార్డులు వంటి పీపీఐల ద్వారా జరిపే యూపీఐ లావాదేవీలకు మాత్రమే ఇంటర్ఛేంజ్ ఫీ 1.1 శాతం చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. యూపీఐ సేవలు పూర్తిగా ఉచితం అని, ఇది సురక్షితం అని, ఎలాంటి ఆటంకాలు లేవని వివరిస్తూ… ప్రతి నెలా 800 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపింది.