ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఉందని అదానీ గ్రూప్ నిర్ణయానికి వచ్చింది. త్వరలోనే భారీ పెట్టుబడులు పెడతామని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ నాయకత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో
అదానీ గ్రూప్ ఎండీ రాజేష్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్లు, సిమెంట్స్ విభాగం ఎండీ కరణ్ అదానీ తదితరలు పాల్గొన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ లో తమ గ్రూప్ పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన రోడ్ మ్యాప్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. అదానీ గ్రూప్ చేసిన ప్రతిపాదనల్లో రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుల్ని అమలు చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అదానీ గ్రూప్ ప్రతినిధులతో సమావేశం వివరాలను ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ చేశారు.
పరిశ్రమల స్థాపన గురించి చంద్రబాబు స్పష్టంగా వివరించారు. అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ప్రాజెక్టులు సాకారమైతే ఏపీ ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని తెలిపారు. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ వంటి రంగాల్లో ఏపీ దూసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని చంద్రబాబు చెప్పారు. రాజధాని ఇన్నర్ రింగ్రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టేందుకు అదానీ సంస్థ ముందుకొచ్చింది. ఇది వరకే సిద్ధం చేసిన ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవసరమైతే కొన్ని మార్పులు చేసి, ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భవానీ ద్వీపం,రాజధాని సీడ్ యాక్సెస్రోడ్డు, కనకదుర్గ గుడి, బస్టాండ్, రైల్వేస్టేషన్లను కలుపుతూ రోప్వే నిర్మాణం చేపడతామంది.
ఏపీ లోని వివిధ ప్రాంతాలకు అనుగుణంగా అదానీ గ్రూప్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టు అందుబాటులోకి అత్యుత్తమ రోప్వే తీసుకువచ్చి, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ – డీబీఎఫ్ఓటీ మోడల్లో ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్ ప్రతిపాదించింది. డీబీఎఫ్ఓటీ విధానంలో విశాఖలో సముద్రపు నీటి నుంచి రోజుకి 100 మిలియన్ లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేసే డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంది. అప్పికొండ బీచ్ దీనికి అనుకూలమని ఇందుకు రూ.800 కోట్ల మేర పెట్టుబడి పెడతామని వివరించింది. సముద్రపు నీటిని రివర్స్ ఆస్మోసిస్ విధానంలో శుద్ధి చేసే టెక్నాలజీని ఉపయోగించి మంచి నీటి ఉత్పత్తి ప్లాంట్ నిర్వహణకు గ్రీన్ ఎనర్జీని వినియోగిస్తామని తెలిపింది.
అదానీ గ్రూప్ రాకతో ప్రభుత్వానికి చాలా విషయాలు కలిసి వస్తాయి. ప్రభుత్వానికి ఆదాయం 30 ఏళ్లకు రూ.10,000ల కోట్ల ఆదాయం రానుందని వెల్లడించింది. టైటానియం డయాక్సైడ్ దిగుమతిని తగ్గించుకోవడం ద్వారా రూ.9000ల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కానుందని వివరించింది. మౌలిక సౌకర్యాల ప్రాజెక్టు, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఆతిథ్య రంగం, మౌలిక వసతుల కల్పన, విద్యాకేంద్రాలు, వర్క్షాప్ల ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకు ప్రాధాన్య రంగంగా గుర్తించి ప్రత్యేక రాయితీలివ్వాలని కోరింది.
మరో వైపు పారిశ్రామిక విస్తరణతో వేలాది ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఏపీ లో యువతకు ఇది శుభవార్తే అనుకోవాలి.